ఇటీవల పెరిగిన వంట నూనే ధరలను నియంత్రించేందుకు కేంద్రం నడుం బిగించింది. ప్రపంచ వ్యాప్తంగా వంటనూనె రేట్లు తగ్గుతుండడంతో దేశంలో కూడా ఆయిల్ కంపెనీలు తమ వంటనూనె బ్రాండ్ల రేట్లను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దిగుమతి చేసుకుంటున్న వంట నూనెల ఎంఆర్పీని లీటర్పై రూ. 10 చొప్పున తగ్గించాలని, ఈ తగ్గింపు కూడా వచ్చే వారంలోపే జరగాలని పేర్కొంది. అలాగే, ఒక బ్రాండ్ వంటనూనె రేటు దేశమంతటా ఒకేలా ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం వివిధ నగరాల్లో ఒకే బ్రాండ్ వంటనూనె లీటరు ధరలో మూడు నుంచి ఐదు రూపాయల తేడా ఉందని, ఇక నుంచి ఒకే గరిష్ఠ ధర ఉండేలా చూసుకోవాలని కంపెనీలకు కేంద్రం సూచించింది.
దేశంలో వంటనూనె అవసరాల్లో 60 శాతం విదేశాల నుంచే దిగుమతి అవుతోంది. అయితే, రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచ వ్యాప్తంగా వంటనూనె రేట్లు పెరిగాయి. దీంతో మన దేశంలో కూడా ఆయా కంపెనీలు ధరల్ని భారీగా పెంచాయి. కానీ, గత కొన్ని నెలల నుంచి వంటనూనెల ధరలు దిగొస్తున్నాయి. దీంతో గత నెలలో వంటనూనె ధరను ఆయా కంపెనీలు లీటర్పై రూ. 10–15 తగ్గించాయి. అంతకుముందు కూడా ఒకసారి రేట్లను సవరించాయి.
వంటనూనె రేట్లు తగ్గడంపై చర్చించేందుకు ఆహార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుదాన్షు పాండే వంటనూనె తయారీదారుల అసోసియేషన్లతో సమావేశం నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితులు, ఎంఆర్పీ తగ్గింపుపై చర్చలు జరిపారు. అంతర్జాతీయంగా తగ్గిన ధరలను వినియోగదారులకూ బదలాయించాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa