ఈ రోజుల్లో మీరు ఆరోగ్యంగా ఉన్నారా అని అడిగితే ఉన్నాం కానీ మాకు ఆ సమస్య ఉందని రక్తపోటు, మధుమేహం, థైరాయిడ్ ల గురించి చెప్పేస్తుంటారు. ఇవన్నీ జీవనశైలి వ్యాధులు. ఆహారం, రోజువారీ జీవన విధానాన్ని మార్చుకోవడం ద్వారా రక్తపోటును సాధారణ స్థాయికి తెచ్చుకోవచ్చు. మన శరీరంలోని ప్రతి భాగానికి చేరేలా రక్తాన్ని గుండె అత్యంత పీడనంతో పంప్ చేయాల్సి ఉంటుంది. గుండె అలా ఫోర్స్ గా పంప్ చేసే సమయంలో.. ధమనులపై పడే ఒత్తిడే రక్తపోటు. ఇది అందరికీ ఉంటుంది. కానీ, పరిమితి దాటితేనే ప్రమాదం.
శరీరానికి తగినంత వ్యాయామం లేకపోవడం రక్తపోటుకు ప్రధాన శుత్రువు. ఆహారం, ఒత్తిళ్లు, తగినంత నిద్ర లేకపోవడం. వీటికితోడు మధుమేహం, స్థూలకాయం వంటి ఇతర సమస్యలు కూడా రక్తపోటుకు దారితీస్తాయి. వీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా రక్తపోటును నియంత్రణలో పెట్టుకోవచ్చు.
రోజువారీ మనం తీసుకునే ఆహారం ద్వారా శరీరంలోకి ఉప్పు ఎంత చేరుతుందన్నది బీపీని నిర్ణయించే కీలక అంశం అవుతుంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అయితే 2,300 మిల్లీగ్రాములు మించకూడదని చెబుతోంది. అంటే ఒక టీస్పూన్ లోపే. అలాగే పంచదార, కొవ్వు పదార్థాలు కూడా. పంచదార తింటే బీపీ ఎందుకు పెరుగుతుందన్న సందేహం రావచ్చు. చక్కెరలు బరువు పెరిగేందుకు దారితీస్తాయి. స్థూలకాయంలో రక్తపోటు పెరిగిపోతుంది. అధిక బరువు కారణంగా శరీర జీవక్రియలు గతి తప్పుతాయి. అప్పుడు మధుమేహం గుండె జబ్బులు, థైరాయిడ్ కూడా పలకరిస్తాయి. అమెరికా హార్ట్ అసోసియేషన్ 6 కేలరీలకు మించకుండా చక్కెరలు తీసుకోవడానికి పరిమితం కావాలని సూచిస్తోంది.
కనుక స్వీట్లు, కేక్ లు, బిస్కెట్స్ తదితర బేకరీ ఉత్పత్తులు, చిప్స్, ఫాస్ట్ ఫుడ్, వీటన్నింటికీ దూరంగా ఉండాలి. నూనె, నెయ్యి కూడా తగ్గించుకోవాలి. చికెన్, మటన్ ను కూడా సాధ్యమైనంత తగ్గించుకోవాలి. పండ్లు, పీచు పదార్థం తీసుకోవడం మంచి చేస్తుంది. ఒమెగా ఫ్యాటీ 3 యాసిడ్స్ చాలా మంచివి. గుండెను కాపాడతాయి. ఇవి చేపలు, రొయ్యలు ఇతర సముద్రపు ఉత్పత్తుల్లో పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు మెదడుకు మేలు చేసే డీహెచ్ ఏ కూడా లభిస్తుంది. దీనివల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. కనుక చికెన్, మటన్ కు బదులు వీటిని తీసుకోవడం మంచిది. మెగ్నీషియం లోపం ఉండకూడదు. మెగ్నీషియం తగినంత తీసుకుంటే రక్తపోటు తగ్గుతుందని వైద్యులు చెబుతున్నా ఎవరూ వినిపించుకోవడం లేదు. తీసుకునే ఆహారంలో మెగ్నీషియం, ఇతర పోషకాలు ఉండేలా చూసుకోవాలి.
వ్యాయామం లేకపోవడం రక్తపోటు, గుండె జబ్బులు, స్థూల కాయం, థైరాయిడ్ వంటి జీవనశైలి వ్యాధుల ముప్పు పెరిగిపోవడానికి ప్రధాన కారణమని అధ్యయనాలు, వైద్యులు చెబుతూనే ఉన్నారు. కానీ, వ్యాయామాన్ని ఆచరణలో పెడుతున్నది కొద్ది మందే. వ్యాయామంతో శరరీంలో అధిక కొవ్వులు కరిగిపోతాయి. రక్త ప్రసరణ సాఫీగా సాగుతుంది. శరీరంలో చురుకుదనం పెరుగుతుంది. ఫలితంగా ఆరోగ్యంగా ఉండొచ్చు. యుక్త వయసు నుంచే రోజువారీ వ్యాయామం జీవన విధానంగా మారిపోతే గుండె జబ్బులు, రక్తపోటు సమస్యలు పలకరించవు. ఆల్కహాల్, పొగతాగడం, గుట్కా సేవనం ఇవి కూడా రక్తపోటు, మధుమేహానికి కారణమవుతున్నాయి. ఆల్కహాల్ లో శరీరంలో కొవ్వులు పెరిగిపోతాయి. దీర్ఘకాలంలో లివర్ దెబ్బతినడం, గుండెకు వెళ్లే రక్త నాళాల మార్గాల్లో పూడికలు ఏర్పడి హార్ట్ ఎటాక్, స్ట్రోక్ ఏర్పడవచ్చు.
రక్తపోటు పెరిగేందుకు నాణ్యమైన నిద్ర, తగినంతగా లేకపోవడం కూడా కారణం కావచ్చు. అందుకని పని ఒత్తిళ్లు ఉన్నాయేమో పరిశీలించుకుని నివారణ చర్యలు తీసుకోవాలి. కొన్ని రకాల ఔషధాలు కూడా రక్తపోటుకు కారణమవుతాయి. ముఖ్యంగా నొప్పి నివారణ మందులను దీర్ఘకాలం పాటు తీసుకోకూడదు. జలుబు, ముక్కు మూసుకుపోవడం నుంచి ఉపశమనం కల్పించే డెకాన్ జెస్టంట్స్ మందులతోనూ బీపీ పెరుగుతుంది. కనుక వీటి వాడకాన్ని తగ్గించుకోవాలి. చివరిగా వైద్యుల సలహా తీసుకోవడం మర్చిపోవద్దు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa