ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అలా వచ్చి ఇలా వెళ్లిందే..భారత గగనతలంపై చైనా విమానం

international |  Suryaa Desk  | Published : Sat, Jul 09, 2022, 03:23 AM

భారత్ అంటే ఎపుడూ ఒంటికాలిపై ఎగిరే చైనా మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడిందన్న వాదన వినిపిస్తోంది. తాజాగా సరిహద్దుల్లో చైనా విమానం ఒకటి దూసుకొచ్చింది. ఈ విమానం లడఖ్ వద్ద భారత సైనిక స్థావరాలకు అత్యంత చేరువలో ఎగిరింది. భారత వాయుసేన రాడార్ ఈ విమానాన్ని గుర్తించడంతో వెంటనే బలగాలు అప్రమత్తం అయ్యాయి. కాసేపటికి ఆ విమానం మళ్లీ చైనా గగనతలంలోకి వెళ్లిపోయింది. 


తూర్పు లడఖ్ వద్ద సరిహద్దులకు సమీపంలోని తమ అధీనంలోని ప్రాంతాల్లో చైనా వాయుసేన విన్యాసాలు చేపట్టింది. ఇందులో పాల్గొన్న ఓ విమానమే భారత సరిహద్దులకు సమీపానికి వచ్చినట్టు వెల్లడైంది. ఈ ఘటనను భారత సైన్యం వెంటనే చైనా సైనికాధికారులకు తెలియజేసింది. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని స్పష్టం చేసింది. జూన్ చివరి వారంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది.


ఇదిలావుంటే భారత సరిహద్దుల్లో చైనా కవ్వింపు చర్యలు, ఉల్లంఘనలు తెలిసిందే. 2020లో గాల్వాన్ లోయలో చైనా సైనికులు భారత భూభాగంలోకి చొచ్చుకురాగా, భారత సైనికులు తీవ్రంగా ప్రతిఘటించారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. అటు, చైనా వైపు కూడా గణనీయంగానే ప్రాణనష్టం జరిగింది. దీనిపై ఇరుదేశాల మధ్య సైనికస్థాయిలో చర్చలు జరగ్గా, కొన్నాళ్లపాటు మౌనంగా ఉన్న డ్రాగన్, ఆ తర్వాత సరిహద్దుల్లో తన దూకుడు షురూ చేసింది. సరిహద్దుల్లో అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలతో ఇప్పటికీ భారత్ కు ఇబ్బందికర పరిస్థితులు సృష్టిస్తూనే ఉంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa