దొంగల తీరుపై పలు సినిమాలు వచ్చాయి. నిజజీవితంలో ఇవి సాధ్యమా అన్నది కూడా మనకు అనుమానం కలుగుతుంది. కానీ నిజజీవితంలో కూడా జరుగుతాయని కొందరు దొంగలు వాటిని నిరూపిస్తున్నారు. ఒక్కొక్కళ్ల అతి తెలివి చూస్తే.. అబ్బబ్బా ఏం తెలివిరా సామీ.. అంటూ ఉంటాం. ఇదిగో ఇక్కడ ఇతగాడి తెలివి చూస్తే అంతకన్నా పెద్ద ఎక్స్ప్రషనే ఇస్తారు. అడిగితేనే సాయం చేయని రోజులు ఇవి అలాంటిది అడగకుండానే పెద్ద సాయం చేస్తామంటే ఎవరికైనా అనుమానం వస్తుంది. సరే తీరా ఏంటని ఆరా తీస్తే.. మన వస్తువులు కొట్టేసి మళ్లీ మనకే వెతికిపెడుతున్నాడని తెలిసి పోలీసులు కూడా అవాక్కయ్యారు.
గాజువాకలోని వడ్లపూడి రైల్వే క్వార్టర్స్కు చెందిన పడాల వినయ్సాయి ఒక బైక్ రైడ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అయితే, ఈ నెల 1వ తేదీన శ్రామికనగర్కు చెందిన పి.రమేశ్ తన ఇంటి ముందు పార్క్ చేసిన బండి చోరీకి గురైందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారం రోజుల తర్వాత రమేశ్కు ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి తాను బైక్ రైడ్ కంపెనీ నుంచి కాల్ చేస్తున్నా బైక్ బుక్ చేశారు కదా అని అడిగాడు. తాను బైక్ బుక్ చేయలేదని, తన బైకే పోయిందని రమేశ్ చెప్పాడు. ఆ గుర్తు తెలియని వ్యక్తి మళ్లీ ఫోన్ చేసి డబ్బులిస్తే మీ బైక్ నేను వెతికిస్తాను అని చెప్పి కాల్ కట్ చేశాడు. దాంతో అనుమానం వచ్చిన రమేశ్ పోలీసులకు చెప్పగా దర్యాప్తు చేసిన పోలీసులు వినయ్సాయే దొంగ అని గుర్తించారు.
పోలీసుల వివరాల మేరకు.. బైక్ రైడ్ కంపెనీలో పనిచేస్తున్న వినయ్సాయి, అప్పులు ఎక్కువగా ఉండటంతో సులభంగా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. దాంతో ఈజీ మనీ కోసం బైక్ దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. అయితే, తెలివిగా అపహరించిన బైక్ల ఓనర్లకే ఫోన్ చేసి.. మీ బైక్ వెతికి పెడతానని, కానీ ఖర్చు అవుతుందని చెప్పి యజమానులకు పెద్ద టోకరా వేస్తున్నాడని పోలీసులు చెప్పారు. ఇలా ఎనిమిది బైక్లను దొంగలించాడని.. రమేశ్ ఫిర్యాదుతో అసలు నిజం బయటకు వచ్చిందన్నారు. గాజువాక పరిధిలో 2, దువ్వా పరిధిలో 3, ఫోర్త్టౌన్ పరిధిలో ఒకటి, ఎయిర్పోర్ట్ పరిధిలో ఒకటి, కంచరపాలెం పరిధిలో ఒక బైక్ దొంగిలించినట్లు నిందితుడు అంగీకరించాడని పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa