ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ కానుకల లెక్కలు తేల్చండి: సోమువీర్రాజు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 17, 2022, 03:40 PM

హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరించడం సరికాదని.. హిందూ ధర్మ ఆచార వ్యవహారాలు ప్రభుత్వం విస్మరిస్తోందంటూ బీజేపీ ఏపీ రాష్ట్ర చీఫ్ సోము వీర్రాజు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో దేవాలయాలకు భక్తులు ఇచ్చిన కానుకలపై పూర్తి క్లారిటీ ఇవ్వాలంటూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సీఎం జగన్‌మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఆలయాలకు అన్ని ఖర్చులన్నీ పోను మిగతా సొమ్మంతా సర్వశ్రేయోనిధికి జమ చేయాలని అధికారులను ఆదేశించారో లేదో అనే విషయాన్ని హిందూ సమాజానికి వెల్లడించాలని వీర్రాజు డిమాండ్ చేశారు. భక్తుల సొమ్మును ప్రభుత్వం దోచుకోవడానికి పూనుకోవడం దారుణమని ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు. దేవాలయాలు, సందర్శనీయ క్షేత్రాల విషయంలో ప్రభుత్వం పొరపడితే నిర్ణయాలు మార్చుకోవాలని కోరుతున్నామని లేఖలో పేర్కొన్నారు. సంవత్సరాల తరబడి వచ్చిన ఆదాయ పొదుపు మొత్తాన్ని చిన్న చిన్న ఆలయాలు ఎఫ్‌డీల రూపంలో భద్రపరుచుకుంటే ఆ మొత్తాలను ప్రభుత్వం దోచుకోవడానికి పూనుకోవడం దారుణమని సోము వీర్రాజు ఆరోపించారు.


సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఐదు లక్షల కంటే ఆదాయం తక్కువ ఉన్న దేవాలయాలను ప్రభుత్వ ఆధీనం నుంచి తప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. అలా చేయకుండా ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిటట్లాడుతున్న చిన్నచిన్న దేవాలయాల నిధులు కూడా మింగేయాలి అనుకోవడం పరమ దుర్మార్గమన్నారు. హిందూ దేవాలయాలు శక్తి కేంద్రాలు, భక్తి కేంద్రాలు, ముక్తి కేంద్రాలు వాటిని మూసివేయడానికి కొంతమంది ప్రయత్నిస్తుంటే ఆ ప్రక్రియలో ప్రభుత్వం కూడా భాగస్వామ్యం కావడం.. దేవదాయ శాఖ భూములు, నిధులను కాజేసి ధార్మిక వ్యవస్థను విచ్చిన్నం చేసే కార్యక్రమానికి వ్యతిరేకంగా ప్రతిఘటిస్తామని సోము వీర్రాజు స్పష్టం చేశారు.


ముల్లాలకు, పాస్టర్లకు గౌరవ వేతనాలు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచే చెల్లిస్తున్నారని సోము వీర్రాజు మండిపడ్డారు. ఔరంగజేబు, నైజాం నవాబు సైతం చేయని విధంగా ఆలయాల సొమ్మును దోచేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. దేవుడు మాన్యాలను కూడా ఇప్పటికే రకరకాల పథకాల పేరట కబ్జా చేశారని పేర్కొన్నారు. కామన్ గుడ్ ఫండ్ అనేది ముఖ్యమంత్రి విచక్షణాధికారానికి లోబడి ఉంటుందని.. కానీ ఇందులో జమ అయిన దేవాలయాల నిధులను అన్యమతస్థులకు పంచి హిందువుల మనోభావాలను దెబ్బతీయడం తగదంటూ సోము వీర్రాజు లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa