వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని మంత్రులకు ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. మహారాష్ట్ర, తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు గోదావరి నది మహోగ్ర రూపం దాల్చింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు పర్యటించాలంటూ సీఎం ఆదేశించారు. అదేవిధంగా ముంపు గ్రామాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సూచించారు. ఈ మేరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు వేణుగోపాలకృష్ణ, గుడివాడ అమర్నాథ్ ఏరియల్ సర్వే చేపట్టనున్నారని అధికారులు తెలిపారు.
ఉభయ గోదావరి జిల్లాలతో పాటు వరద ప్రభావానికి గురైన ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలంటూ ప్రభుత్వం ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. వరద సహాయ, పునరావాస వ్యయం కింద జిల్లా కలెక్టర్లకు అదనపు నిధులు కూడా విడుదల చేసింది. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలకు రూ.5 కోట్ల నిధులు కేటాయించింది. ఉభయ గోదావరి జిల్లాలకు చెరో రూ.2 కోట్లు ఖర్చు చేసుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా పునరావాస కేంద్రాల్లో ఉండే వరద బాధితులు ఇళ్లకు వెళ్లే సమయంలో ఆర్థిక సహాయం కింద రూ.వెయ్యి ఇవ్వనున్నట్లు సీఎం జగన్ గతంలోనే చెప్పారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మందులు, ఆహార సరఫరా, తాగునీరు, పాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎటపాక, చింతూరు, కూనవరం, వీఆర్పురం, దేవీపట్నం మండలాల్లో ఏరియల్ వ్యూ ద్వారా పరిస్థితులను మంత్రులు సమీక్షించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa