ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొత్త సోషల్ మీడియా ప్లాట్ ఫాంపై ఎలాన్ మస్క్ ఆసక్తి

international |  Suryaa Desk  | Published : Fri, Aug 12, 2022, 08:43 PM

కొత్త సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఏర్పాటుపై టెస్లా సంస్థ అధినేత ఎలాన్ మస్క్ యోచిస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ట్విట్టర్ ను కొంటానని ఆసక్తి చూపించి, నకిలీ స్పామ్ ఖాతాల పేరుతో డీల్ నుంచి తప్పుకుందామనుకున్న ఎలాన్ మస్క్ కోర్టు విచారణ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆయనకు వ్యతిరేకంగా ట్విట్టర్ డెలేవార్ కోర్టులో పిటిషన్ వేయడం తెలిసిందే. ఈ క్రమంలో ట్విట్టర్లో మస్క్ ను ఓ ఫాలోవర్ ఒక ప్రశ్న వేశాడు. 


‘‘ట్విట్టర్ తో డీల్ సాకారం కాకపోతే.. మీ సొంత సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఏర్పాటు చేసే ఆలోచన ఉందా?’’ అని యూజర్ ప్రశ్నించాడు. దీనికి మస్క్ సైతం నర్మగర్భంగా సమాధానం ఇచ్చాడు. ఎక్స్ డాట్ కామ్ అన్న డొమైన్ పేరుతో రిప్లయ్ ఇచ్చారు. అంతకుమించి ఏమీ చెప్పలేదు. ఎక్స్ డాట్ కామ్ అనే పోర్టల్ ఆర్థిక సేవల కోసం మస్క్ ఏర్పాటు చేసింది. దీన్ని పేపాల్ కొనుగోలు చేసి విలీనం చేసుకుంది. తిరిగి 2017లో ఎక్స్ డాట్ కామ్ పోర్టల్ హక్కులను మస్క్ సొంతం చేసుకున్నారు.


తన ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లాలో మస్క్ 6.9 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను గత వారం విక్రయించడం తెలిసిందే. న్యాయస్థానం ఆదేశిస్తే ట్విట్టర్ ను కొనుగోలు చేయడానికి అతడికి డబ్బులు అవసరం. దీంతో ముందుగానే ఆ నిధి మొత్తాన్ని షేర్ల విక్రయం ద్వారా సమకూర్చుకున్నారు. అయితే, ట్విట్టర్ కొనుగోలు చేయకపోతే తిరిగి ఈ మొత్తంతో టెస్లా షేర్లను కొనుగోలు చేస్తానని ఆయన ప్రకటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa