పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న 'ఓజీ' సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ అభిమానుల్లో ఉత్కంఠ తారాస్థాయికి చేరుతోంది. ఈ క్రేజ్ కేవలం సాధారణ ప్రేక్షకులకే పరిమితం కాలేదు, టాలీవుడ్లోని ఇతర హీరోలను కూడా తాకింది. తాజాగా యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ 'ఓజీ' పై చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమా కోసం తానెంతగా ఎదురుచూస్తున్నాడో ఆయన మాటల్లోనే స్పష్టమవుతోంది.విజయదశమి కానుకగా ఈ నెల 25న 'ఓజీ' ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, అప్పటివరకు ఆగడం కష్టంగా ఉందని సిద్ధు తన 'ఎక్స్' ఖాతాలో పేర్కొన్నారు. "ఓజీ హైప్కి హెల్త్ అప్సెట్ అయ్యేలా ఉంది. 25వ తేదీ వరకూ మేము ఉంటామో పోతామో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఇలా ఉంటే 25 తర్వాత పరిస్థితి ఏంటో. పవన్ కల్యాణ్ గారు, యే పవన్ నహీ.. ఆంధీ హై" అంటూ ఆయన ట్వీట్ చేశారు. పవన్ పోస్టర్ను షేర్ చేస్తూ, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పోస్ట్తో ఇండస్ట్రీ వర్గాలు సైతం సినిమా కోసం ఎంత ఆత్రుతగా ఎదురుచూస్తున్నాయో అర్థమవుతోంది.మరోవైపు, తెలంగాణలో ఇప్పటికే 'ఓజీ' అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఆన్లైన్లో టికెట్లు పెట్టిన క్షణాల్లోనే అమ్ముడైపోతుండటం సినిమాపై ఉన్న అంచనాలకు నిదర్శనంగా నిలుస్తోంది. అభిమానులు టికెట్ల కోసం పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు.సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఒక పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. ఇందులో పవన్ మునుపెన్నడూ చూడని సరికొత్త అవతారంలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు భారీ స్పందనను రాబట్టుకున్నాయి. ఇక సినిమా కథాంశంపై పూర్తి స్పష్టత ఇచ్చే ట్రైలర్ రేపు విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa