ముఖ నటి తాప్సి నటించిన సినిమా చూసి ఫిదా అయ్యారు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. తాప్సి, భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘సాండ్ కీ ఆంఖ్’. తుషార్ హీరానందని దర్శకత్వం వహించిన ఈ సినిమా 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం దిల్లీలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కోసం స్పెషల్ స్క్రీనింగ్ వేశారు. కేజ్రీవాల్ తన భార్య, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో కలిసి ఈ సినిమాను వీక్షించారు. సినిమా తనకు చాలా నచ్చిందని, తాప్సి, భూమికి కంగ్రాట్స్ చెప్పారు. ఈ సినిమా తప్పకుండా అందరూ చూసి తీరాలని మనీష్ సిసోడియా కూడా మెచ్చుకున్నారు. ఉత్తర్ప్రదేశ్, రాజస్థాన్తో పాటు మరికొన్ని ప్రదేశాల్లో ఈ సినిమాపై పన్ను ఎత్తివేశారు. ఉత్తర్ప్రదేశ్లోని జోహ్రి అనే గ్రామానికి చెందిన చంద్రో తోమర్, ప్రకాశీ తోమర్ అనే ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఉండేవారు. చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసేయడంతో కుటుంబం కోసమే తమ జీవితాన్ని వెచ్చించారు. తమలా తమ కుమార్తెల జీవితాలు కాకూడదని భావించి 50 ఏళ్ల వయసులో తుపాకీ చేతపడతారు. వారి చదువులను అడ్డుకోవాలని చూసేవాళ్లని తుపాకీలతో బెదిరించేవారు. ఈ నేపథ్యంలో తుపాకీతో టార్గెట్ మిస్సవకుండా దేన్నైనా కొట్టగలిగే సామర్ధ్యం తమలో ఉందని వారికి తెలుస్తుంది. అలా వారు జాతీయ స్థాయిలో జరిగిన రైఫిల్ షూటింగ్లో పాల్గొన్నారు. ఇద్దరూ దాదాపు 300లకు పైగా పతకాలు సాధించారు. ఇందులో తాప్సి చంద్రో తోమర్ పాత్రలో, భూమి ప్రకాషీ తోమర్ పాత్రలో నటించారు. ఈ సినిమా కోసం 60 ఏళ్ల వృద్ధుల పాత్రల్లో నటించేందుకు ఏమాత్రం వెనుకాడలేదు. వృద్ధుల పాత్రల్లో నటించేందుకు చాలా మంది సీనియర్ నటీమణులు ఉన్నారని వారిని వదిలేసి తాప్సి, భూమిలాంటి కథానాయికలను ఎందుకు ఎంపిక చేసుకున్నారని విమర్శలు వెల్లువెత్తాయి. కంగనా రనౌత్ సోదరి రంగోలీ కూడా తాప్సిని నోటికొచ్చినట్లు తిట్టింది. ఆ తర్వాత తాప్సి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టి అందరి నోళ్లు మూయించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa