ప్రస్తుతం టాలీవుడ్ లో మల్టీస్టారర్ ల ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పుడు ఎస్విఆర్-ఏఎన్ఆర్, ఎన్టిఆర్, కృష్ణ.. వంటివారు ఒకే స్క్రీన్ పంచుకొని సంచలనాలు సృష్టించారు. కొన్ని రోజుల తరువాత వీటికి బ్రేక్ పడింది. ఎవరి హీరోయిజాన్ని వాళ్ళు నిరూపించుకుంటూ అభిమానుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. దీనివల్ల అభిమానుల్లో పోటీ మొదలైంది. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని వాదించుకోవటం అలవాటైపోయింది. ఇప్పుడు హీరోయిజాన్ని పక్కనపెట్టి యువ హీరోలు ఒకే స్క్రీన్ ను పంచుకోవడానికి సిద్దమవుతున్నారు. అదే ఇప్పుడు ట్రెండ్ అయ్యింది. మళ్లీ ఈ మల్టీ స్టార్ సినిమాలకు పునాది వేసింది విక్టరీ వెంకటేష్. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో మహేష్ తో స్క్రీన్ ను పంచుకున్న వెంకీ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో గోపాల గోపాలలో చిందులేశాడు. రామ్ మసాలా, వరుణ్ తో ఎఫ్2 చేసి స్క్రీన్ పై నవ్వులు పూయించాడు. ఇక్కడి నుంచే మల్టీ స్టార్ సినిమాలపై ఆసక్తి పెరిగింది. తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన రాజమౌళి కూడా ఇదే ట్రెండ్ ను ఫాలో అయ్యాడు. బాహుబలి కోసం ప్రభాస్, రాణాను రంగంలోకి దింపి సక్సెస్ అయ్యాడు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా కాసుల సునామీని సృష్టించింది. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమా ప్రకటించి మరో మెట్టు వేశాడు జక్కన్న. ఇందులో రామ్ చరణ్, ఎన్ టిఆర్ లను తీసుకుని అద్భుతం సృష్టించబోతున్నాడు. ఈ సినిమాపై అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. ఇదే మార్గంలో కొరటాల శివ కూడా వెళ్తున్నాడు. చిరంజీవితో సినిమా తీస్తున్న కొరటాల అందులో మహేష్ ను కూడా చూపించబోతున్నాడు. ఇప్పటికే మహేష్ కు రెండు హిట్లు ఇచ్చిన కొరటాల మల్టీ స్టార్ సినిమాతో అభిమానులకు ఫుల్ మజాను ఇవ్వనున్నాడు. ఇందులో మహేష్ స్టూడెంట్ లీడర్ గా చేస్తాడనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. సరిలేరు నీకెవ్వరూ..ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఒకే వేదికపై కనిపించిన చిరు-మహేష్ ఇప్పుడు ఒకే స్క్రీన్ ను పంచుకోనున్నారు. ఇకపోతే పక్క ఇండస్ట్రీ నుంచి కూడా వచ్చి హీరోలు తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఊపిరి సినిమాలో కార్తీ, నాగార్జున, అలాగే సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో ఉపేంద్ర, అల్లుఅర్జున్, ఈగ సినిమాలో నాని, సుదీప్ లు, రక్తచరిత్రలో సూర్య, వివేక్ వంటి హీరోలు ఒకే స్క్రీన్ పై అలరించారు. సీనియర్ హీరోలతో పాటు యువ హీరోలు కూడా ఈ ఫార్ములాను ఫాలో అవుతున్నారు. ఒకరి సినిమాలను మరొకరు ప్రమోట్ చేస్తున్నారు. కొన్ని సినిమాల్లో గెస్ట్ రోల్ చేసి తమ స్నేహాన్నిచాటుకుంటున్నారు. అవసరమైతే విలన్ గా చేసి ఆ పాత్రకు న్యాయం చేస్తున్నారు. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా ప్రేక్షకులను అలరించిన జగపతి బాబు ఇప్పుడు ప్రతినాయకునిగా హీరోలతో స్క్రీన్ ను షేర్ చేసుకుంటున్నాడు. తన నటనతో హీరోలకంటే ఎక్కువగా ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. అరవింద సమేత సినిమాలో తన నటన ప్రేక్షకులను కట్టిపడేసింది. తాజాగా మహేష్ మాట్లాడుతూ మేంమేం బాగానే ఉంటాం.. మీరు కూడా బాగుండాలి..కలిసుండాలని చెప్పారు. ఇకపై ఇండస్ట్రీలో ఒక హీరో ఫంక్షన్ కు మరో హీరో రావడం ట్రెండ్ అవుతుందని ఆ సమయంలో చెప్పారు. ఇప్పుడు ఇదే ట్రెండ్ ను అందరూ ఫాలో అవుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa