ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'మాయాబజార్' మాయకు 63 ఏళ్ళు

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 27, 2020, 03:05 PM

షావుకారు, పాతాళభైరవి, మిస్సమ్మ, జగదేకవీరుని కథ, గుండమ్మ కథ లాంటి జనరంజక చిత్రాలను నిర్మించిన విజయా సంస్థ.. తెలుగు సినీ అభిమానులకందించిన మరొక అపురూప కళాఖండం 'మాయాబజార్'. ఒక్క స్టార్ హీరో ఉన్నాడంటేనే ఆ సినిమాకు క్యూ కట్టే ఈ రోజుల్లో ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్.వి. రంగారావు, సావిత్రి లాంటి నటీనటులు నటించిన మాయాబజార్ సినిమా కోసం అప్పట్లో ప్రజలు నిద్రలు మానుకొని మరీ థియేటర్ల ముందు ఎదురుచూసారు. మాయాబజార్ సినిమా కోసం పింగళి నాగేంద్రరావు రచించిన మాటలు, పాటలు అజరామరంగా నిలిచాయి. ఈ చిత్రంలో రచయిత పింగళి నాగేంద్రరావు "తస్మదీయులు, దుష్టచతుష్టయం, జియ్యా, రత్న గింబళీ, గిల్పం, శాఖంబరి దేవి ప్రసాదం", వంటి కొత్త పదాలను మనకు రుచి చూపిస్తాడు. 'రసపట్టులో తర్కం కూడదు, భలే మామా భలే, ఇదే మన తక్షణ కర్తవ్యం, ఎవరూ కనిపెట్టకుండా మాటలు ఎలా పుడతాయి, వేసుకో వీరతాడు' వంటి సంభాషణలు ప్రజల స్మృతిలో నిలిచాయి. మాయాబజార్ సినిమా తెలుగునాట క్లాసిక్ స్థాయికి చేరింది. సాధారణ ప్రేక్షకుల నుంచి సినిమారంగ ప్రముఖుల వరకూ ఎందరెందరో మాయాబజార్ తమ అభిమాన చిత్రంగా చెప్తుంటారు. సినిమా విడుదలైనప్పుడు విజయా సంస్థ నందమూరి తారక రామారావు నటించిన కృష్ణుని పాత్ర ఆహార్యంతో 40వేల క్యాలెండర్లు ముద్రించి అమ్మారు. రాష్ట్రమంతటా ఇళ్లలో, షాపుల్లో ఆ క్యాలెండర్లకు ఫ్రేమ్ కట్టించి పెట్టుకున్నారు. అగ్రశ్రేణి తారలంతా నటించిన విజయా వారి 'మాయాబజార్' చిత్రం విడుదలై నేటికి సరిగ్గా అరవై మూడు సంవత్సరాలు అవుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa