కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా లక్షల మందికి కరోనా సోకగా వేలమంది ప్రాణాలను కోల్పోయారు. మన దేశంలోనూ కరోనా తన ఉగ్రరూపాన్ని చూపిస్తోంది. రోజు రోజుకు కరోనా కేసులు కుప్పలు తెప్పులుగా పెరుగుతున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు అధికమవుతుండగా.. మరణాల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. కరోనాను కట్టడి చేయడంలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలను చేపడుతున్నారు. కరోనా వ్యాప్తిని నివారించడానికి భారత ప్రభుత్వం ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధించింది. ఈ సమయంలో ప్రజలెవరూ రోడ్ల మీదుక రాకూడదని ఇంటికి పరిమితం కావాలని ఆదేశించింది. దీంతో దేశంలో అన్ని రకాల కార్యకలాపాలు స్తంభించిపోయాయి. దినసరి కూలీలు శ్రామికులు కార్మికులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కరోనా వైరస్ పై పోరాటం చేసేందుకు మేముసైతం అంటూ సినీ తారలు ముందుకు వచ్చారు. టాలీవుడ్ నుండి కూడా అందరు హీరోలు తమకు తోచిన ఆర్థిక సాయాన్ని ప్రకటిస్తూ ప్రభుత్వాలకు అండగా నిలబడుతున్నారు. ఇలాంటి కష్ట సమయాల్లో హీరోలు మాత్రమే ముందుకు రావడం హీరోయిన్లు రాకపోవడం చర్చనీయాంశమైంది.స్టార్స్గా వెలుగొందుతున్న హీరోయిన్స్ ఏ మాత్రం నోరు మెదపకపోవడం ఆర్థిక సాయాన్ని ప్రకటించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ప్రణీత ముందడుగు వేసి ఓ యాభై కుటుంబాలకు అండగా నిలబడింది. లావణ్య త్రిపాఠి సినీ కార్మికుల కోసం లక్ష రూపాయల విరాళాన్ని ప్రకటించింది. ఇప్పుడు తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా ముందుకొచ్చింది. గుర్గావ్లోని తన ఇంటికి దగ్గర్లో ఉన్న రెండు వందల కుటుంబాలకు రోజూ రెండు పూటల అన్నం పెడుతోందట. తన ఇంటి చుట్టుపక్కల ఉన్న పేదవారిని తన తండ్రి గుర్తించాడని వారికి నిత్యం ఆహారం అందిస్తున్నామని తెలిపింది. లాక్ డౌన్ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు వారికి ఆహారాన్ని అందిస్తామని చెప్పుకొచ్చింది. వారు ఆ ఆహారాన్ని తింటూ ఉంటే వారి కళ్లలో వచ్చే ఆనందం చూస్తే అంత కంటే గొప్ప ఫీలింగ్ మరెక్కడా కనిపించదని పేర్కొంది. రకుల్ చూసైనా మిగతా హీరోయిన్లు సాయం చేయడానికి బయటకి వస్తారేమో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa