నటి రిచా చద్దాకు బేషరతు క్షమాపణలు చెప్పేందుకు సిద్ధమంటూ ముందుకొచ్చిన మరో నటి పాయల్ ఘోష్ యూటర్న్ తీసుకుంది. తాను ఎవరికీ క్షమాపణలు చెప్పేందుకు సిద్ధంగా లేనని తేల్చి చెప్పింది. తాను ఎవరిపైనా అవాస్తవాలు ప్రచారం చేయలేదని, రిచా గురించి అనురాగ్ తనతో చెప్పిన విషయాన్ని మాత్రమే తాను వెల్లడించానని పేర్కొంది. దీంతో రిచా, పాయల్ మధ్య వివాదం సమసిపోయిందనుకున్న వేళ మరోమారు ఇది చర్చనీయాంశమైంది. దర్శకుడు అనురాగ్ కశ్యప్పై ఇటీవల లైంగిక ఆరోపణలు చేసిన పాయల్ ఘోష్.. రిచా చద్దా పేరును కూడా బయటకు లాగింది. తనతో రిచా అత్యంత సన్నిహితంగా ఉంటుందని అనురాగ్ తనతో చెప్పాడని పేర్కొంది.
పాయల్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన రిచా అతడు తనకు ఓ స్నేహితుడు మాత్రమేనని, పాయల్ తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలంటూ బాంబే హైకోర్టులో రూ. 1.1 కోట్లకు పరువునష్టం దావా వేసింది. ఈ పిటిషన్ నిన్న విచారణకు రాగా, పాయల్ తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తోందని, రిచాకు బేషరతు క్షమాపణలు చెప్పేందుకు సిద్ధంగా ఉందని ఆమె తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. స్పందించిన రిచా తరపు న్యాయవాదులు పాయల్ క్షమాపణలను అంగీకరించేందుకు తమ క్లయింట్ సిద్ధంగా ఉందని కోర్టుకు తెలియజేశారు. దీంతో వీరిద్దరి మధ్య నెలకొన్న వివాదం సమసిపోయిందని భావించారు.
తాజాగా, పాయల్ యూటర్న్ తీసుకుంది. తాను క్షమాపణలు చెప్పాలనుకోవడం లేదని తెగేసి చెప్పింది. రిచాను ఇబ్బంది పెట్టాలని తాను అనుకోవడం లేదని, సాటి మహిళగా మరో మహిళకు అండగా ఉండాలనే కోరుకుంటానని పేర్కొంది. కశ్యప్కు వ్యతిరేకంగా న్యాయం కోసం పోరాడుతున్నానని, అతడి నిజస్వరూపాన్ని ప్రపంచానికి తెలియజేయాలనుకుంటున్నానని తెలిపింది. తాను ఎవరితోనూ తప్పుగా ప్రవర్తించలేదని, ఎవరిపైనా అవాస్తవాలు ప్రచారం చేయలేదని స్పష్టం చేసింది. రిచా గురించి అనురాగ్ తనతో చెప్పిన విషయాన్ని మాత్రమే తాను బయటకు చెప్పానని పాయల్ వివరించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa