ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అల్లు రామలింగయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ముగ్గురు మనవళ్లు

cinema |  Suryaa Desk  | Published : Fri, Oct 01, 2021, 10:33 AM

తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఓ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు నటులు అల్లు రామలింగయ్య. వెయ్యికిపైగా చిత్రాల్లో నటించి ఎన్నో అద్భుత పాత్రలకు ప్రాణం పోశారు. తనదైన కామెడీతో టాలీవుడ్‌లో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన రామలింగయ్యను పద్మశ్రీ అవార్డు కూడా వరించింది. హోమియోపతి వైద్యాన్ని అభ్యసించి, చుట్టూ ఉన్న వారికి తగిన వైద్యం అందిస్తూ, మరోవైపు నాటకాలు వేసిన రామలింగయ్య 'పుట్టిల్లు' అనే సినిమా ద్వారా చిత్ర సీమకు పరిచయం అయ్యారు. దాదాపు అందరు బడా హీరోల సినిమాల్లో కామెడియన్‌గా నటించి ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం అల్లు ఇటు మెగా ఫ్యామిలితో పాటు అటు అల్లు ఫ్యామిలీలో ఎంతో మంది రామలింగయ్య వారసత్వంగా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు.


ఈ క్రమంలోనే అల్లు రామలింగయ్య కుమారుడు అరవింద్‌ నిర్మాణ రంగంలో తనదైన ముద్రవేయగా.. మనవళ్లు అల్లు అర్జున్‌, శిరీష్‌ హీరోలుగా రాణిస్తున్నారు. ఇక నేడు (అక్టోబర్‌ 1) అల్లు రామలింగయ్య జయంతి ఈ సందర్భంగా ఆయన అభిమానులతో పాటు కుటుంబ సభ్యులు వేడుకలు జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగానే తాజాగా రామలింగయ్య మనవళ్లు వెంకటేశ్‌, అర్జున్‌, శిరీష్‌లు తమ తాతకు ఘన నివాళులు అర్పించారు. అల్లు రామలింగయ్య స్మారకార్థం అల్లు ఫ్యామిలీ హైదరాబాద్‌లో 'అల్లు స్టూడియోస్‌' నిర్మిస్తున్న విషయం తెలిసిందే.తాజాగా రామలింగయ్య జయంతి సందర్భంగా స్టూడియోలో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాన్ని ముగ్గురు మనవళ్లు ఆవిష్కరించారు. ఈ విషయాన్ని బన్నీ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా స్వయంగా అభిమానులతో పంచుకున్నారు. విగ్రహాన్ని ఆవిష్కరించిన సందర్భంలో దిగిన ఫొటోను పోస్ట్‌ చేస్తూ.. 'ఈ రోజు మా తాత పద్మశ్రీ రామలింగయ్య గారి జయంతిన వారి విగ్రహాన్ని ఆవిష్యరించాము. ఈ కార్యక్రమంలో నాతో పాటు వెంకటేశ్‌, శిరీష్‌ పాల్గొన్నారు. ఆయన మా గర్వకారణం, అల్లు స్టూడియోస్‌ నిర్మాణ ప్రయాణంలో తోడుగా ఉంటారు' అంటూ క్యాప్షన్‌ రాసుకొచ్చారు.


ఇదిలా ఉంటే రామ లింగయ్య జయంతి సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవి శుక్రవారం రాజమహేంద్రవరం రానున్నారు. స్థానిక అల్లు రామలింగయ్య ప్రభుత్వ హోమియో కళాశాలలో అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించనున్నారు. కళాశాలలో రూ.2 కోట్లతో నిర్మించిన కొత్త భవనాన్ని ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి చిరంజీవితో పాటు ఆయన భార్య సురేఖ, నిర్మాత అల్లు అరవింద్‌ హాజరు కానున్నారు.



 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa