రవి కిషన్ పేరు చెప్పగానే ‘రేసుగుర్రం’ చిత్రంతో మద్దాలి శివారెడ్డి పాత్ర గుర్తొస్తుంది. అంతగా ఆ పాత్రను పండించారాయన. భోజ్పురి చిత్రాల్లో కథానాయకుడిగా నటించిన రవి కిషన్ హిందీ, తెలుగు, మరాఠి, కన్నడ చిత్రాల్లో నటించారు. ‘రేసుగుర్రం’ తర్వాత ‘కిక్ 2’, ‘సుప్రీమ్’, ‘రాధ’, ‘లై’, ‘సాక్ష్యం’, ‘గద్దలకొండ గణేశ్’, ‘90 ఎం.ఎల్’, ‘సైరా’ వంటి సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నటుడిగా ఆయన కెరీర్ ఎలా ప్రారంభమయిందో తెలిపారు.‘‘నా తండ్రి కారణంగా 17 ఏళ్ల వయసులో ఇంటి నుంచి పారిపోయి ముంబయికి వచ్చాను. ఆయనకు భావోద్వేగాలు తక్కువ. నన్ను దారుణంగా కొట్టి చిత్రహింసలు పెట్టేవాడు. ఒకానొక సమయంలో ఆయన నన్ను చంపాలనుకున్నాడు. ఆ విషయం అమ్మకు అర్థమై పారిపొమ్మని చెప్పింది. రూ.ఐదు వందలతో ఇంటి నుంచి వచ్చేశా. ట్రైన్ ఎక్కి ముంబై చేరుకున్నా. మా నాన్న కోపంలో అర్థముంది. మాది సంప్రదాయ కుటుంబం. వ్యవసాయం లేదా ప్రభుత్వం ఉద్యోగం చేయమన్నారు. మా కుటుంబంలో ఒక నటుడు పుడతాడని ఎప్పుడూ అనుకోలేదు. ఆ సమయంలో ఇంటి దగ్గర ‘రామ్లీలా’ నాటకం వేయగా సీతగా నటించా. అది చూసి ఆయన షాక్ అయ్యారు. నన్ను బాగా కొట్టారు. కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా. వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటూ నటుడిగా చిత్ర పరిశ్రమలో పేరు తెచ్చుకున్నాను. ఈ భూమ్మీద నుంచి వెళ్లేటప్పుడు మనకంటూ ఒక గుర్తింపు ఉండాలని చిన్నతనంలోనే ఫిక్స్ అయ్యా. ఆ ఆశతోనే నటుడిగా మారాను. చిన్నతనంలో నన్ను బాగా కొట్టినందుకు చివరి రోజుల్లో నాన్న బాధపడ్డారు. ‘నువ్వే మాకు గర్వకారణం’ అని కన్నీళ్లు పెట్టుకున్నారు’’ అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa