నటుడు మహేష్ బాబుపై ఏపీ సీఎం జగన్ వీరాభిమానులు గుర్రుమంటున్నారు, కన్నెర్ర చేస్తున్నారు. వారి కోపావేశానికి కారణముంది. అదేమిటంటే...సీనియర్ నటి, దర్శకురాలు విజయ నిర్మల మృతితో సినీ ఇండస్ట్రీ మొత్తం విషాదంలో మునిగింది. ‘‘నా ‘ప్రాణం’ పోయింది...’’ అంటూ, సూపర్ స్టార్ కృష్ణ కన్నీటిపర్యంతమవుతున్నారు. ఆ దంపతుల మధ్య ప్రేమానురాగాలు అంత బలంగా పెనవేసుకున్నాయి. ఒకరిని విడిచి ఒకరు ఎప్పుడూ లేరు. ఒకరంటే ఒకరికి ప్రాణం. ఎక్కడున్నా, ఎక్కడికెళ్లినా జంటగా వెళ్లాల్సిందే. ఆ జంట ఇప్పుడు విడిపోయింది. అందుకే, ‘‘నా ‘ప్రాణం’ పోయింది...’’ అంటూ, సూపర్ స్టార్ కృష్ణ కన్నీటిపర్యంతమయ్యారు. ఆయనను ఓదార్చడానికి తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ సహా అనేకమంది వచ్చి వెళ్లారు.
కృష్ణను పరామర్శించేందుకు వచ్చిన ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబును, ఆయన బావమరిది బాలక్రిష్ణను, లోకేష్ బాబును మహేష్ బాబు బాగా రిసీవ్ చేసుకున్నారట. నాన్న కృష్ణ వెంటే ఉన్నారు. తండ్రి మానసిక పరిస్థితిని, పిన్నితో అనుబంధాన్ని బాబుకు, బాలయ్యకు వివరించారు. ఏపీ సీఎం జగన్ వచ్చినప్పుడు మాత్రం మహేష్ బాబు కనిపించలేదు. కనీసం సీఎం వస్తున్నారని ముందస్తు సమాచారం ఉన్నప్పటికి కూడా హాజరుకాలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శకు వచ్చినప్పుడు హాజరై అన్నీ తానై వ్యవహరించిన మహేష్ ఫొటోలు బయటకు రాగానే జగన్ ఫ్యాన్స్ హర్టయ్యారు. సీఎం జగన్ ఫ్యాన్స్ కోపానికి ఇప్పుడు ఇదే కారణమైంది. సోషల్ మీడియా సాక్షిగా మహేష్ బాబును ట్రోల్స్ చేస్తున్నారు.
జగన్ ను మహేష్ అవమానించారంటూ ఆయన మండిపడుతున్నారు. ‘చంద్రబాబు కంటే వైఎస్ ఫ్యామిలీనే ఘట్టమనేని ఫ్యామిలీకి దగ్గర’ అంటూ ఉదాహరణలు చూపుతున్నారు.
నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, వివాదంలో ఉన్న సూపర్ స్టార్ కృష్ణ ‘పద్మాలయ స్టూడియో’ భూములను క్రమబద్దీకరించారని.. మహేష్ ‘సైనికుడు’ సినిమా విడుదలైనప్పుడు వరంగల్ లో జరిగిన గొడవలో కూడా మహేష్ ను వైఎస్ క్షమించారని పాత విషయాలు జగన్ అభిమానులు తవ్వి తీస్తున్నారు.
ఇక మహేష్ బాబాయ్ ఘట్టమనేని ఆది శేషగిరిరావు కూడా మొన్నటివరకు వైసీపీలోనే ఉన్నారు. ఎన్నికల ముందే టీడీపీలో చేరారు. అంతేకాదు, కృష్ణ ఫ్యామిలీ మొత్తం వైఎస్ ఆర్ సీపీ పార్టీతో అనుబంధం ఉన్నవారే. జగన్ కూడా మహేష్ కు బెస్ట్ ఫ్రెండే. ఇంత సాన్నిహిత్యం ఉన్నా కూడా ఏపీ సీఎం హోదాలో తొలిసారి వచ్చిన జగన్ ను మహేష్ రిసీవ్ చేసుకోకపోవడం.. పైగా ప్రతిపక్ష నేత చంద్రబాబు వచ్చిన సమయంలో ఉండడంతో జగన్ ఫ్యాన్స్ లో కోపం కట్టలు తెంచుకుంది. ప్రతిపక్ష నేతకు ఇచ్చిన గౌరవం అధికార పార్టీ సీఎంకు ఇవ్వరా...? అని మహేష్ ను నెటిజన్లు ప్రశ్నలతో కడిగేస్తున్నారు. ఇప్పుడు మహేష్ ను సోషల్ మీడియా వేదికగా ఇదే విషయంపై ట్రోల్స్ తో జగన్ ఫ్యాన్స్ ఎండగడుతున్నారు.
‘పాపం... కుటుంబంలోని ఇద్దరు పెద్దల్లో ఒకరిని కోల్పోయిన బాధలో వాళ్లుంటే... ఈ వీరాభిమానుల చిల్లర గొడవేమిటి...?’ అని విసుక్కుంటున్న నెటిజన్లు కూడా ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa