జైపూర్లో జరిగిన ఐఫా ఉత్సవంలో బాలీవుడ్ తారలు సందడి చేశారు. ఈ సందర్భంగా సీనియర్ నటి మాధురీ దీక్షిత్ మాట్లాడారు. ‘‘చిత్రసీమలోని మహిళలు ప్రతిసారీ తమని తాము నిరూపించుకోవాల్సి వస్తోంది. హీరోల్లాగే మేమూ ప్రేక్షకులను ఆకర్షించగలం. అందరం సమానమే. పారితోషికం విషయంలో కూడా వ్యత్యాసం అలాగే కొనసాగుతుంది. నా కెరీర్లో ఎన్నో గొప్ప బలమైన పాత్రలు చేయగలిగాను. ‘బేటా’, ‘దిల్’, ‘రాజా’, ‘దిల్ తో పాగల్ హై’.. ఇలా చాలా ఉన్నాయి. నిజంగా నేను ఎంతో ఆస్వాదిస్తూ చేసిన ఒకే ఒక్క చిత్రం ‘మృత్యుదండ్’. మాధురీ కమర్షియల్ చిత్రాలే బాగా చేయగలదు అనుకొనేవారు. అలాంటి సమయంలో నాకు ఈ చిత్రంలో అవకాశం వచ్చింది. మహిళా సాధికారతను గొప్పగా చూపించిన పాత్రను ఇందులో నేను పోషించాను. ఓ మహిళ తలెత్తుకొని నిలిచి తనేంటో చెప్పిన చిత్రం. ఒకప్పుడు హెయిర్ డ్రెస్సింగ్ లాంటి ఒకటో రెండో విభాగాాల్లో మాత్రమే స్ర్తీలు కనిపించేవారు. నెమ్మదిగా అది మారుతూ వచ్చింది. ఇప్పుడు సినిమాకు సంబంధించిన ప్రతి విభాగంలో ఉన్నారు. నిజంగా ఇది చాలా పెద్ద మార్పు’’ అని అన్నారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత గునీత్ మోంగా మాట్లాడుతూ ‘‘పారితోషికం విషయంలో హీరోహీరోయిన్ల మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఈ విషయంలో నటులు స్పందించాల్సిన అవసరం ఉంది. నాయికా ప్రాధాన్య చిత్రం ‘స్త్రీ 2’ భారీగా వసూళ్లు తీసుకొచ్చింది. ఇలాంటి అద్భుతాలు ఎన్నో చేయగల సత్తా మహిళల్లో ఉంది. దాని కోసం అవకాశాలు మనమే సృష్టించుకోవాలి. గణాంకాలు చూస్తుంటే కాస్త బాధగానే ఉంది. దర్శకుల్లో మహిళలు మూడు శాతం కంటే తక్కువే ఉన్నారు. నటుల్లో 9 శాతం కంటే తక్కువే ఉన్నారు. కానీ ఈ పరిస్థితి మారాలి’’ అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa