చిత్ర పరిశ్రమకు చెందిన వారిపై నటి, ఎంపీ కంగనా రనౌత్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఎమర్జెన్సీ' చిత్రాన్ని ఉద్దేశించి దర్శక నిర్మాత సంజయ్గుప్తా ఇచ్చిన రివ్యూపై ఆమె స్పందించారు.కంగన తన అంచనాలు తప్పని నిరూపించారని ఆయన పేర్కొనడంపై ఆమె మాట్లాడారు. ముందుగానే తనపై ఒక అభిప్రాయానికి రావొద్దని విజ్ఞప్తి చేశారు.''నాపై ముందుగానే ఒక అభిప్రాయానికి వచ్చినట్టు ఆయన తన పోస్ట్లోనే అంగీకరించారు. నన్ను అర్థం చేసుకోవడంలో మీరు పరాజయం అయినప్పుడు.. మళ్లీ నాపై ఒక అభిప్రాయానికి రావాలని ఎందుకు అనుకుంటున్నారు? తన అభిప్రాయం తప్పిందని ఆయన పేర్కొన్నారు. నేను ఎలాంటి సినిమా చేశానో మీకు ముందే ఎలా తెలుసు? నా గురించి ముందే తెలుసుకునేందుకు మీవద్ద ఏమైనా అద్భుత శక్తులు ఉన్నాయా? ఒక వ్యక్తి గురించి ఏదైనా అభిప్రాయానికి రావాలంటే వాళ్ల గురించి అన్ని విషయాలు తెలుసుకొని ఉండాలి. అయినా నన్ను జడ్జ్ చేసేందుకు మీకున్న అర్హతలు ఏమిటి? మీరు ఎలాంటి సినిమాలు రూపొందించారు? ఇండస్ట్రీలో ఉన్నవాళ్లు కూడా.. తాము ఎలాంటి సినిమాలు తెరకెక్కిస్తున్నారో ఒక్కసారి చెక్ చేసుకోవాలి'' అని ఆమె పేర్కొన్నారు.
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జీవితం ఆధారంగా 'ఎమర్జెన్సీ' చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమాకు దర్శకత్వం వహించి నిర్మాతగానూ వ్యవహరించిన కంగనా ఇందిరాగాంధీ పాత్రలో నటించారు. జయప్రకాష్ నారాయణ్ పాత్రలో అనుపమ్ ఖేర్, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ పాత్రలో శ్రేయస్ తల్పడే కనిపించారు. ఎన్నో అడ్డంకులు దాటుకుని ఈ ఏడాది ఇది ప్రేక్షకుల ముందుకువచ్చింది. ప్రస్తుతం ఇది ఓటీటీలో అందుబాటులో ఉంది.ఇటీవల ఈ సినిమా గురించి సంజయ్గుప్తా ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ''ఎమర్జెన్సీ' వీక్షించా. కంగన దీనిని ఇంత చక్కగా రూపొందిస్తారని నేను ఏమాత్రం ఊహించలేదు. ఆమె నా అంచనాలు తారుమారు చేశారు. ఇదొక అద్భుతమైన చిత్రం. చిత్రాన్ని ఆమె తెరకెక్కించిన తీరు.. ఆమె నటన చాలా బాగున్నాయి'' అని ఆయన రాసుకొచ్చారు.
![]() |
![]() |