మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించిన తాజా చిత్రం 'ఎల్2: ఎంపురాన్'. గతంలో విడుదలై బ్లాక్బస్టర్ హిట్ అయిన 'లూసిఫర్' చిత్రానికి ఇది సీక్వెల్గా వస్తోంది. ఈ నెల 27న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో హైదరాబాద్లో తాజాగా ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్, నిర్మాత దిల్రాజు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మోహన్ లాల్ మాట్లాడుతూ.. తెలుగు సినీ పరిశ్రమను దేశంలోనే ది బెస్ట్ ఇండస్ట్రీ అని అన్నారు. తెలుగు ప్రేక్షకులు నటీనటులను గౌరవించే విధానం తనను ఎంతో ఆకట్టుకుందని తెలిపారు. తన 47 ఏళ్ల కెరీర్లో అనేకమంది తెలుగు నటులతో కలిసి పని చేసే అవకాశం లభించిందని, నాగేశ్వరరావుతో కలిసి నటించడం తన అదృష్టమన్నారు.గతంలో తన మలయాళ చిత్రాలు తెలుగులో రీమేక్ అయ్యాయని, ఇప్పుడు తమ సినిమా డైరెక్ట్గా తెలుగులోనే విడుదల చేయడం ఆనందంగా ఉందన్నారు. 'ఎల్2: ఎంపురాన్' కోసం రెండు సంవత్సరాలు కష్టపడ్డామని మోహన్ లాల్ చెప్పారు. ఈ మూవీ 50 రోజుల ఫంక్షన్ను మీ అందరితో కలిసి జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాగా, ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత దిల్రాజు విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.
![]() |
![]() |