ప్రముఖ నటి తమన్నా భాటియా సినీ పరిశ్రమలో అడుగుపెట్టి 20 ఏళ్లు పూర్తయ్యాయి. 2005లో 'చాంద్ సా రోషన్ చెహ్రా' చిత్రంతో ఆమె నటిగా తెరంగేట్రం చేశారు. తన 20 ఏళ్ల కెరీర్లో వివిధ భాషల్లో నటించి ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు.తాజాగా ఆమె ప్రధాన పాత్రలో నటించిన 'ఓదెల 2' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన సినీ ప్రయాణానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాను పదో తరగతి చదువుతున్నప్పుడే చిత్ర పరిశ్రమలోకి వచ్చానని, నటనను కేవలం వృత్తిగా కాకుండా ఇష్టంగా, ఆనందంగా చేశానని ఆమె అన్నారు.నిజ జీవితంలో తాను కళాశాల విద్యను అభ్యసించలేకపోయినప్పటికీ, సినిమాల్లో మాత్రం విద్యార్థినిగా నటించానని ఆమె తెలిపారు. పరిశ్రమలో 20 ఏళ్లు పూర్తి చేసుకోవడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. కెరీర్ ప్రారంభించినప్పుడు ఇన్నేళ్లు కొనసాగుతానని అనుకోలేదని అన్నారు. ఈ సందర్భంగా తన 21వ పుట్టినరోజున జరిగిన ఒక సంఘటనను ఆమె గుర్తు చేసుకున్నారు.ఆ రోజు షూటింగ్ నుండి విరామం తీసుకుని ఇంటిలో ఉండగా, ఒక తమిళ పత్రికలో తనను నంబర్ 1 నటిగా పేర్కొంటూ ఒక ప్రత్యేక కథనం వచ్చిందని, అది చదివి తాను కన్నీళ్లు పెట్టుకున్నానని ఆమె అన్నారు. ఆ స్థాయికి త్వరగా చేరుకుంటానని తాను ఎప్పుడూ అనుకోలేదని ఆమె అన్నారు. నంబర్ 1 స్థానానికి చేరుకున్న తర్వాత, ఆ స్థానంలో కొనసాగడం అంత సులువు కాదని ఆమె అభిప్రాయపడ్డారు. అది ఒక బాధ్యతగా భావించి, ప్రేక్షకులను అలరించే విధంగా సినిమాలు చేయాలనే లక్ష్యంతో ఈ స్థాయికి చేరుకున్నానని తమన్నా వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa