హీరోయిన్ తాప్సీ పన్ను గొప్ప మనసు చాటుకున్నారు. వేసవి కాలం కావడంతో ఎండలకు అల్లాడిపోతున్న ముంబయి మురికివాడల్లోని పేదలకు ఫ్యాన్లు, కూలర్లు ఉచితంగా అందజేశారు. హేమకుంట్ అనే ఫౌండేషన్ ఆధ్వర్యంలో తన భర్త మథియాస్ బోతో కలిసి ఆమె పేదల ఇళ్లకు వెళ్లి మరీ వాటిని పంపిణీ చేశారు. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటడంతో తక్కువ ఆదాయం, మురికివాడ ప్రాంతాలలో నివసించే కుటుంబాలకు ఉపశమనం కల్పించే లక్ష్యంతో తాప్సీ ఈ చొరవ తీసుకున్నారు. శీతలీకరణ ఉపకరణాలు అందజేసి అక్కడి నివాసితులకు ఎండ తాపం నుంచి ఉపశమనం కల్పించారు.ఈ వితరణ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తాప్సీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అందమైన నటి మాత్రమే కాదు అందమైన మనసున్న మనిషి అంటూ కొనియాడుతున్నారు.ఈ సందర్భంగా తాప్సీ మాట్లాడుతూ... "మనం ఫ్యాన్ లేదా కూలర్ వంటి ప్రాథమిక సౌకర్యాలను తేలికగా తీసుకుంటాం. కానీ, చాలా మందికి ముఖ్యంగా ఈ భరించలేని వేడిలో ఉన్న వారికి చిన్న గాలి కూడా ఒక వరంలా అనిపిస్తుంది. ఈ చొరవలో భాగం కావడం నన్ను చాలా కదిలించింది. ఇది ఇవ్వడం గురించి మాత్రమే కాదు - ఇది ప్రజలతో నిలబడటం, వారి బాధను అర్థం చేసుకోవడం. మనకు తోచిన సాయం చేసి దానిని తగ్గించడం" అని ఆమె చెప్పుకొచ్చారు. హేమకుంట్ ఫౌండేషన్ డైరెక్టర్ హర్తీరత్ సింగ్ మాట్లాడుతూ... “ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటినప్పుడు, గాలి లేదా నీడ లేని మురికివాడ ప్రాంతాలలో ఉండటం దాదాపు అసాధ్యం అవుతుంది. రోజు గడపడానికి ఫ్యాన్ లేదా కూలర్ లేకుండా ప్రజలు మౌనంగా బాధపడుతున్నారు. అదే మమ్మల్ని ఈ వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ప్రేరేపించింది. ఇది ఇక్కడి వారికి కొంత ఓదార్పు, కొంత ఉపశమనం కలిగిస్తుంది. ఇది మానవత్వాన్ని చాటి చెబుతుంది” అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa