ప్రముఖ నటి సమంత తన కెరీర్ తొలినాటి రోజులను గుర్తుచేసుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను నటించిన మొదటి రెండు చిత్రాలను ఇప్పుడు చూస్తే చాలా సిగ్గుగా అనిపిస్తుందని ఆమె అన్నారు. నటిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించినప్పుడు నటన గురించి పెద్దగా తెలియదని, ఆ సినిమాల్లో తాను దారుణంగా నటించాననే భావన కలుగుతుందని సమంత పేర్కొన్నారు.ప్రేక్షకులకు మంచి కథాబలమున్న చిత్రాలను అందించాలనే సంకల్పంతో సమంత నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆమె నిర్మాతగా వ్యవహరిస్తున్న తొలి చిత్రం 'శుభం'. ఈ సినిమా ప్రచారంలో భాగంగా శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో సమంత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, "నా తొలి రెండు సినిమాలను ఇప్పుడు చూసుకుంటే ఇంకా బాగా నటించవచ్చు కదా అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే సిగ్గుగా కూడా ఉంటుంది. కానీ 'శుభం' చిత్రంలో నటించిన వారందరూ కొత్తవారే అయినా అద్భుతంగా నటించారు. వారి నటన నన్ను ఎంతగానో ఆకట్టుకుంది" అని తెలిపారు.తెలుగు ప్రేక్షకులు ఎల్లప్పుడూ మంచి కంటెంట్ను ఆదరిస్తారని సమంత అభిప్రాయపడ్డారు. "మనసును హత్తుకునే కథతో సిద్ధమైన మా 'శుభం' చిత్రాన్ని కూడా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నాను. ఈ చిత్రంలోని నటీనటులందరూ భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నాను" అని ఆమె ఆకాంక్షించారు.నిర్మాతగా మారడంపై స్పందిస్తూ, జీవితంలో సవాళ్లను స్వీకరించడం తనకు ఇష్టమని, నిర్మాతగా ఇది తనకు ఒక కొత్త ప్రయాణం అని సమంత వివరించారు. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించిన 'శుభం' చిత్రంలో హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియా కొంతం ప్రధాన పాత్రలు పోషించారు. సమంతకు చెందిన 'ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్' పతాకంపై ఈ చిత్రం నిర్మితమైంది. మే 9వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa