ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశ గొప్పదనం, సంప్రదాయాలపై యువతకు అవగాహన లోపం ఉందని వెల్లడి

cinema |  Suryaa Desk  | Published : Thu, May 01, 2025, 07:41 PM

నేటి యువత భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను విస్మరించి, పాశ్చాత్య పోకడలను గుడ్డిగా అనుసరిస్తోందని సూపర్ స్టార్ రజనీకాంత్ ఆందోళన వ్యక్తం చేశారు. తన అర్ధాంగి లత నిర్వహించిన ఓ సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఈ విషయంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. యువతతో పాటు కొందరు పెద్దలు కూడా మన దేశ గొప్పతనాన్ని, వారసత్వాన్ని తెలుసుకోవడంలో విఫలమవుతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో, మన సంస్కృతి గొప్పతనంపై అందరికీ అవగాహన కల్పించేందుకు తన భార్య లత మంచి ప్రయత్నం ప్రారంభించారని ప్రశంసించారు. లత చేపట్టిన ఈ కార్యక్రమం భగవంతుడి ఆశీస్సులతో విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు రజనీకాంత్ వెల్లడించారు.ఈ మొబైల్ యుగంలో చాలా మంది యువతకు, చివరికి కొందరు పెద్దలకు కూడా మన దేశ గొప్ప సంప్రదాయాల గురించి తెలియడం లేదని ఆయన అన్నారు. భారతదేశపు ఘనమైన వారసత్వం, విలువలను తెలుసుకోకుండానే పాశ్చాత్య సంస్కృతి వైపు మొగ్గు చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మన మూలాలను మరిచిపోవడం సరికాదని హితవు పలికారు.విదేశీయులు సైతం వారి సంస్కృతుల్లో శాంతి, సంతోషాలను పొందలేక మన దేశం వైపు చూస్తున్నారని రజనీకాంత్ పేర్కొన్నారు. ఇక్కడి యోగా, ధ్యానం వంటి వాటి ద్వారా వారు మానసిక ప్రశాంతతను పొందుతున్నారని తెలిపారు.ఇదిలా ఉండగా, రజనీకాంత్ సినిమాల విషయానికొస్తే, ఆయన ప్రస్తుతం లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో 'కూలీ' చిత్రంలో నటిస్తున్నారు. బంగారం స్మగ్లింగ్ నేపథ్యంలో యాక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, శ్రుతి హాసన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa