తెలుగు సినిమా చరిత్రలో మైలురాయిగా నిలిచిపోయిన చిత్రం 'జగదేకవీరుడు అతిలోకసుందరి'. మెగాస్టార్ చిరంజీవి, దివంగత అందాల తార శ్రీదేవి జంటగా నటించిన ఈ దృశ్యకావ్యం విడుదలై 35 వసంతాలు పూర్తి చేసుకుంటోంది. ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని, వైజయంతీ మూవీస్ అధినేత సి. అశ్వినీదత్ ఈ క్లాసిక్ చిత్రాన్ని మే 9న రీమాస్టర్ చేసి, సరికొత్త సాంకేతిక హంగులతో మరోసారి థియేటర్లలోకి తీసుకువస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు సినిమా నాటి మధుర స్మృతులను, తెరవెనుక కష్టాలను గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా నిర్మాత అశ్వినీదత్, 'దినక్కు తా... దినక్కు తా' పాట చిత్రీకరణ సమయంలో చిరంజీవి పడిన శ్రమను గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు.1990 మే 9న విడుదలైన ఈ చిత్రం అప్పట్లో సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. అజరామరమైన పాటలు, అద్భుతమైన విజువల్స్, చిరంజీవి-శ్రీదేవిల కెమిస్ట్రీ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. అయితే, తెరపై కనిపించే ఆ అద్భుతం వెనుక ఎంతో కష్టం దాగి ఉందని, ముఖ్యంగా 'దినక్కు తా' పాట సమయంలో చిరంజీవి అంకితభావం మరువలేనిదని అశ్వినీదత్ అన్నారు."ఆ పాట షూటింగ్ సమయంలో చిరంజీవి గారికి తీవ్రమైన జ్వరం. దాదాపు 106 డిగ్రీల జ్వరంతో ఆయన బాధపడుతున్నారు. కానీ శ్రీదేవి గారి కాల్షీట్లు చివరి రెండు రోజులే ఉన్నాయి. ఆ తర్వాత ఆమె నెలన్నర పాటు విదేశాల్లో మరో షూటింగ్కు వెళ్లిపోవాలి. పాటను ఆ రెండు రోజుల్లోనే పూర్తి చేయాల్సిన ఒత్తిడి. ఒకే సెట్లో ఆ పాట మొత్తం తీయాలి. చిరంజీవి గారి పరిస్థితి చూసి షూటింగ్ ఆపేద్దామా అనిపించింది. కానీ ఆయన డెడికేషన్ అలాంటిది. ప్రతి షాట్కు ముందు, షాట్ గ్యాప్లో ఐస్ ప్యాక్లతో శరీరాన్ని చల్లబరుచుకుని, జ్వరం కొంచెం తగ్గాక మళ్లీ కెమెరా ముందుకొచ్చేవారు. అంత తీవ్రమైన జ్వరంలో కూడా ఎక్కడా ఎనర్జీ తగ్గకుండా డ్యాన్స్ చేశారు. ఆ రెండు రోజులు ఆయన పడిన కష్టం మాటల్లో చెప్పలేనిది. షూటింగ్ పూర్తయిన వెంటనే ఆయనను విజయ హాస్పిటల్లో చేర్పించాం. దాదాపు 15 రోజుల చికిత్స తర్వాత ఆయన కోలుకున్నారు. ఆయన అంకితభావం, వృత్తి పట్ల నిబద్ధత వల్లే ఆ పాట అంత అద్భుతంగా వచ్చింది" అని అశ్వినీదత్ వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa