గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'పెద్ది'. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ కీలకమైన, సుదీర్ఘమైన షెడ్యూల్ హైదరాబాద్లో మొదలైంది. ఈ షెడ్యూల్ కోసం నగర శివార్లలో ఓ భారీ గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించే సెట్ను నిర్మించినట్లు తెలుస్తోంది.సినిమా కథానుగుణంగా, సహజత్వానికి పెద్దపీట వేస్తూ ఈ సెట్ను తీర్చిదిద్దారని సమాచారం. ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా, ఆయన బృందం ఈ భారీ విలేజ్ సెట్ను అద్భుతంగా నిర్మించారని చిత్ర యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సెట్లో ఉత్కంఠ రేపే యాక్షన్ సన్నివేశాలతో పాటు, కొన్ని కీలకమైన టాకీ సన్నివేశాలను కూడా చిత్రీకరించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 30 శాతం పూర్తయిందని, తాజా షెడ్యూల్తో సినిమాలోని చాలా ముఖ్యమైన భాగం చిత్రీకరణ పూర్తవుతుందని చిత్ర బృందం భావిస్తోంది.పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్తో 'పెద్ది' రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే విడుదలైన 'ఫస్ట్ షాట్ గ్లింప్స్' ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఈ సినిమాలో రామ్ చరణ్ పొడవాటి జుట్టు, గడ్డం, ముక్కుపుడకతో పూర్తి గ్రామీణ, రగ్డ్ లుక్లో కనిపించనున్నారు. ఆయన మేకోవర్ అందరినీ ఆకట్టుకుంటోంది.ఈ చిత్రంలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్కుమార్, విలక్షణ నటుడు జగపతి బాబు, దివ్యేందు శర్మ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దేశంలోని ప్రముఖ సినిమాటోగ్రాఫర్లలో ఒకరైన ఆర్. రత్నవేలు కెమెరా బాధ్యతలు నిర్వర్తిస్తుండగా, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని 2026 మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయాలని మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa