ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డారు..మంచు లక్ష్మి

cinema |  Suryaa Desk  | Published : Sat, Jun 14, 2025, 01:51 PM

అహ్మదాబాద్‌లో ఎయిర్‌ ఇండియా డ్రీమ్‌లైనర్‌ విమాన ప్రమాదం యావత్తు దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది . ఈ ఘటన వందలాది కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంపై సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ప్రమాదం నుంచి మంచు లక్ష్మి తృటిలో తప్పించుకున్నట్లు తెలిసింది. విమానం కూలిన రోజు మంచు లక్ష్మి  కూడా లండన్‌కు వెళ్లే ఎయిర్‌ ఇండియా ఫ్లైట్‌లోనే ప్రయాణించారు. అయితే, అదృష్టవశాత్తూ ఆమె ముంబై నుంచి వెళ్లే ఫ్లైట్‌ ఎక్కడంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా ఎక్స్‌ వేదికగా తెలిపారు. ప్రమాదం జరిగిన రోజు తాను కూడా ఎయిర్‌ ఇండియా ఫ్లైట్‌లోనే లండన్‌కు వెళ్లినట్లు తెలిపారు. దీంతో ఈ ప్రమాదంలో తనకు ఏదైనా జరిగిందా అని చాలా మంది ఫోన్లు చేస్తున్నట్లు చెప్పారు. అభిమానులు కూడా మెసేజ్‌లు పెడుతున్నట్లు తెలిపారు. అయితే, ప్రమాదం జరిగిన రోజు తాను ముంబై నుంచి లండన్‌ వెళ్తున్న ఎయిర్‌ ఇండియా ఫ్లైట్‌లో ప్రయాణించినట్లు చెప్పారు. ప్రస్తుతం తాను క్షేమంగా ఉన్నానంటూ ఎక్స్‌లో మంచు లక్ష్మి తెలిపారు. 'అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం జరిగిన రోజు నేను, మా అమ్మాయి ముంబై నుంచి లండన్‌ వెళ్లే ఎయిర్‌ ఇండియా ఫ్లైట్‌లో ప్రయాణించాం. దేవుడి దయవల్ల మేము క్షేమంగా లండన్‌ చేరుకున్నాం. అక్కడ ల్యాండ్‌ అయిన తర్వాత ప్రమాదం గురించి తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. ఈ దుర్ఘటనలో ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం నిజంగా బాధాకరం. ఈ ప్రమాదంలో విద్యార్థులు, వైద్యులు మృతి చెందారని తెలిసి నా హృదయం ముక్కలైంది. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. మన ప్రాణాలు క్షణంలో ముగిసిపోతాయనడానికి ఈ ప్రమాదమే ఓ ఉదాహరణ. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను' అని మంచు లక్ష్మి ఎక్స్‌ పోస్టులో రాసుకొచ్చారు. 274కు చేరిన మృతుల సంఖ్య గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్‌ నుంచి లండన్‌లోని గాట్విక్‌ ఎయిర్‌పోర్ట్‌కు బయల్దేరిన ఎయిర్‌ ఇండియాకు  చెందిన డ్రీమ్‌లైనర్‌ ఫ్లైట్‌ టేకాఫ్‌ అయిన నిమిషాల వ్యవధిలోనే ఓ బిల్డింగ్‌పై కూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో 265 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఆ సంఖ్య ఇప్పుడు 274కు చేరిందని తెలిపారు. వీరిలో 241 మంది విమాన ప్రయాణికులు, సిబ్బంది కాగా.. ఇతరులు 33 మంది ఉన్నట్లు చెప్పారు. ఈ ఘటనలో విమానంలోని ఒకే ఒక్క ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం అతను అహ్మదాబాద్‌ సివిల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa