ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇకపై సోషల్ మీడియాలకి దూరంగా ఉండనున్న అనుష్క

cinema |  Suryaa Desk  | Published : Sat, Sep 13, 2025, 10:53 AM

ప్రముఖ కథానాయిక అనుష్క శెట్టి తన అభిమానులకు అనూహ్యమైన షాక్ ఇచ్చారు. తాను కొంతకాలం పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాల్లో చేతిరాతతో రాసిన ఒక నోట్‌ను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది."బ్లూ లైట్ నుంచి క్యాండిల్ లైట్‌కు మారుతున్నా. స్క్రోలింగ్‌కు అతీతంగా ఉన్న ప్రపంచంతో, మనం నిజంగా మొదలైన చోటుతో తిరిగి కనెక్ట్ అయ్యేందుకు సోషల్ మీడియా నుంచి కొంతకాలం తప్పుకుంటున్నాను" అని అనుష్క తన నోట్‌లో పేర్కొన్నారు. మరిన్ని కథలతో, మరింత ప్రేమతో త్వరలోనే మళ్లీ కలుస్తానని, ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని అభిమానులకు సందేశమిచ్చారు.ఇటీవలే అనుష్క నటించిన 'ఘాటి' సినిమా సెప్టెంబర్ 5న విడుదలైన విషయం తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో, విక్రమ్ ప్రభుతో కలిసి ఆమె నటించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు మిశ్రమ స్పందన లభించింది. అయినప్పటికీ, అనుష్క నటనకు విమర్శకుల నుంచి విశేష ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా ప్రమోషన్లలో చురుకుగా పాల్గొన్న ఆమె, విడుదలైన కొద్ది రోజులకే సోషల్ మీడియాకు విరామం ప్రకటించడం గమనార్హం.కాగా, 'ఘాటి' ప్రమోషన్ల సందర్భంగా అనుష్క పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, ఇంకా ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నారని మీడియా అడిగిన ప్రశ్నకు ఆమె బదులిచ్చారు. "నాకు పూర్తి స్థాయి నెగెటివ్ పాత్ర చేయాలని ఉంది. బలమైన కథ వస్తే తప్పకుండా విలన్‌గా నటిస్తాను" అని తన మనసులోని మాటను బయటపెట్టారు.ప్రస్తుతం తాను కొత్త కథలు వింటున్నానని, మంచి ప్రాజెక్టులు వరుసలో ఉన్నాయని అనుష్క తెలిపారు. తన తొలి మలయాళ సినిమాతో పాటు, త్వరలోనే ఓ ఆసక్తికరమైన తెలుగు సినిమా ప్రకటన కూడా ఉంటుందని ఆమె వెల్లడించారు. 'వేదం' తర్వాత క్రిష్‌తో కలిసి ఆమె పనిచేసిన సినిమా కావడంతో 'ఘాటి'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు అనుష్క తదుపరి ప్రాజెక్టులపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa