బాలీవుడ్లో ప్రస్తుతం నడుస్తున్న పీఆర్ సంస్కృతిపై ప్రముఖ నటుడు మనోజ్ బాజ్పేయీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కొందరు నటీనటులకు రాత్రికి రాత్రే 'ఉత్తమ నటుడు', 'నేషనల్ క్రష్' వంటి ట్యాగ్లు కట్టబెట్టడంపై ఆయన మండిపడ్డారు. ఇలాంటి ప్రచారాల వల్ల నిజంగా కష్టపడి పనిచేసే నటులకు సరైన గుర్తింపు దక్కడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఒక తాజా ఇంటర్వ్యూలో మనోజ్ బాజ్పేయీ మాట్లాడుతూ, "ఇండస్ట్రీలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తాను ఏదైనా సినిమాలో బాగా నటించానని సంతోషించేలోపే, పీఆర్ టీమ్లు మరొక నటుడిని 'బెస్ట్ యాక్టర్' అంటూ ప్రచారం చేస్తున్నాయి. దీంతో వారికే ఎక్కువ గుర్తింపు లభిస్తోంది. ఈ కొత్త సంస్కృతి చాలా చిరాకు తెప్పిస్తోంది" అని అన్నారు. ఇలాంటి చర్యలు సీనియర్ నటులను అవమానించడమేనని ఆయన అభిప్రాయపడ్డారు."నటనలో ఎంతో శిక్షణ పొంది, ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న పియూశ్ మిశ్రా లాంటి గొప్ప నటులు ఎందరో ఉన్నారు. అలాంటి వారిని కాదని, వారి తర్వాత వచ్చిన వారికి గొప్ప ట్యాగ్లు ఇవ్వడం సీనియర్లను అవమానించడమే అవుతుంది" అని మనోజ్ పేర్కొన్నారు.అయితే, ఈ ఇంటర్వ్యూలో ఆయన 'నేషనల్ క్రష్' అనే పదాన్ని వాడటంతో, ఆయన నటి రష్మిక మందన్నను ఉద్దేశించి విమర్శలు చేశారంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. మరోవైపు, ఆయన ఏ ఒక్కరినీ టార్గెట్ చేయలేదని, కేవలం ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ను మాత్రమే విమర్శించారని ఆయన అభిమానులు వాదిస్తున్నారు.1994లో సినీ రంగ ప్రవేశం చేసిన మనోజ్ బాజ్పేయీ, ప్రస్తుతం వరుస సినిమాలు, వెబ్ సిరీస్లతో బిజీగా ఉన్నారు. ఆయన నటించిన 'ఇన్స్పెక్టర్ జెండె' సిరీస్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుండగా, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ది ఫ్యామిలీ మ్యాన్ 3' విడుదలకు సిద్ధమవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa