రామ్చరణ్ నటిస్తున్న 'పెద్ది' సినిమా నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మొదటి పాటను విజయదశమి రోజున విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అదే పండగ రోజున మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్లో రాబోతున్న కొత్త సినిమా కూడా లాంఛనంగా ప్రారంభం కానుంది.'గేమ్ ఛేంజర్' తర్వాత గ్లోబల్ స్టార్ రామ్చరణ్ నటిస్తున్న భారీ చిత్రం 'పెద్ది'. 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. గ్రామీణ క్రీడల నేపథ్యంలో సాగే రివెంజ్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా గ్లింప్స్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. 'దేవర'తో విజయం అందుకున్న జాన్వీ కపూర్ ఇందులో హీరోయిన్గా నటిస్తుండగా, ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో కీలక సన్నివేశాలు, కర్ణాటకలోని మైసూరులో ఏకంగా వెయ్యి మంది డ్యాన్సర్లతో ఓ భారీ పాటను చిత్రీకరించారు. సినిమాకు ఈ పాట హైలైట్గా నిలుస్తుందని చిత్రబృందం చెబుతోంది. చాలాకాలంగా అప్డేట్ లేకపోవడంతో నిరాశలో ఉన్న అభిమానులను ఖుషీ చేసేందుకు, దసరాకు తొలి పాటను రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. రామ్చరణ్ పుట్టినరోజు సందర్భంగా వచ్చే ఏడాది మార్చి 27న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.మరోవైపు, 'వాల్తేరు వీరయ్య' సినిమా తర్వాత చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్లో మరో సినిమా రాబోతోంది. ఈ ప్రాజెక్ట్ను కూడా దసరా రోజునే అధికారికంగా ప్రారంభించనున్నారు. ఇలా ఒకే రోజున రామ్చరణ్ సినిమా పాట, చిరంజీవి కొత్త సినిమా ప్రారంభోత్సవంతో మెగా అభిమానులకు పండగ వాతావరణం ముందుగానే మొదలుకానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa