by Suryaa Desk | Mon, Aug 12, 2024, 07:55 PM
తెలంగాణ ఐఏఎస్, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ మెంబర్ స్మితా సబర్వాల్ ఈమధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. అఖిల భారత్ సర్వీసుల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు అవసరమా..? అంటూ ట్విట్టర్లో ఆమె చేసిన పోస్టు.. నెట్టింట పెద్ద దుమారాన్ని రేపగా.. అది ఇంకా చల్లారలేదు. దివ్యాంగుల రిజర్వేషన్లపై స్మితా సబర్వాల్ చేసిన పోస్టులపై నెటిజన్లే కాకుండా.. దేశంలోని చాలా మంది మాజీ ఐఏఎస్లు, ప్రజా ప్రతినిధులు స్పందించటమే కాదు.. ముక్తకంఠంతో వ్యతిరేకించారు కూడా. అయితే.. ఆమె మాత్రం తన అభిప్రాయాన్ని ఇప్పటికి కూడా మార్చుకోకుండా.. తాను చేసిన స్టేట్మెంట్కే కట్టుబడి ఉన్నారు. ఈ క్రమంలోనే.. స్మితా సబర్వాల్ చేసిన కామెంట్లపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
దివ్యాంగులపై స్మితా సబర్వాల్ చేసిన స్టేట్ మెంట్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని సామాజికవేత్త వసుంధర.. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో పిల్ దాఖలు చేశారు. యూపీఎస్సీ ఛైర్మన్కు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో కోరారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలను సవాలు చేసేందుకు పిటిషనర్కు ఉన్న అర్హత ఏంటని ప్రశ్నించింది. అయితే... పిటిషనర్ ఒక దివ్యాంగురాలు అని పిటిషనర్ తరపు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. దీంతో.. ఈ పిటిషన్పై పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఇదిలా ఉంటే.. స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే చాలా మంది ప్రజాప్రతినిధులు, మాజీ ఐఏఎస్లు అభ్యంతరం వ్యక్తం చేయగా.. ఎంతో మంది దివ్యాంగులు రోడ్డుకెక్కి.. తమ నిరసన వ్యక్తం చేశారు. ఇక.. నెట్టింట వచ్చిన వ్యతిరేకతా అంతా ఇంతా కాదు. స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు దివ్యాంగుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్ ఐఏఎస్గా ఉండి సమాజంలో ఉన్న అసమానతలను పోగొట్టేందుకు ప్రయత్నించాల్సిందిపోయి.. ఇలా దివ్యాంగులను వేరు చేసి మాట్లాడటంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
కాగా.. సీనియర్ ఐఏఎస్గా ఉన్న స్మితా సబర్వాల్పై ఇప్పటికే.. కేంద్రానికి కూడా పలువురు ఫిర్యాదు చేయగా.. ఇప్పుడు హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు కావటంతో.. ఈ వివాదం ఇంకా ముదిరేలా కనిపిస్తోంది. మరి.. ఈ వివాదానికి ఎక్కడ ముగింపు పడుతోందనేది సర్పత్రా చర్చనీయాంశంగా మారింది.