by Suryaa Desk | Mon, Sep 09, 2024, 07:19 PM
సాధారణంగా పసుపును కూరల్లో వాడుతుంటారు. హిందువులైతే పూజల్లోనూ కూడా పసుపును వాడతారు. కాళ్లకు కూడా పసుపు రాసుకుంటుంటారు. ఏదైనా దెబ్బతగిలితే యాంటీ సెప్టిక్గానూ వాడతారు. ఇన్ని రకాలుగా పసుపును ఉపయోగిస్తుంటారు. మనకు ఇక్కడివరకే తెలుసు. కానీ... హైదరాబాద్లోని దూల్ పేటకు చెందిన ఈ మహిళ చేసిన పని తెలిస్తే దిమ్మతిరగాల్సిందే. లోపల ఉండే పసుపును ఎలా వాడొచ్చనేది పక్కనపెడితే.. ఆ ప్యాకెట్ను మాత్రం ఈ మహిళ.. ఊహించని రీతిలో వాడుతోంది. పైకి పసుపు ప్యాకెట్టే కానీ.. ఓపెన్ చేస్తే మాత్రం లోపల మత్తెక్కించే గంజాయి ఉంటుంది. ఎక్సైజ్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు చేసిన దాడిలో ఈ విస్తుపోయే విషయం వెలుగు చూసింది.
శేరిలింగంపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో తెలంగాణ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అధికారులు జరిపిన దాడిలో పసుపు ప్యాకెట్ల ముసుగులో గంజాయిని విక్రయిస్తున్న మహిళ పట్టుబడింది. సాధారణంగా పసుపు కోసం ఉపయోగించే ప్యాకెట్లలో గంజాయి నింపి అమ్ముతున్నట్టు వచ్చిన సమాచారంలో అధికారులు దాడి చేసి.. మహిళను పట్టుకున్నారు. ఈ దాడిలో మహిళ దగ్గర.. గంజాయి నింపిన 10 పసుపు ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
అయితే.. అరెస్టయిన మహిళ.. ధూల్ పేట్కు చెందిన నేహా భాయ్గా అధికారులు గుర్తించారు. అయితే.. ఆమె గత కొంతకాలంగా ఈ అక్రమ వ్యాపారం చేస్తున్నట్టుగా తెలిసింది. కాగా.. ఈ వ్యాపారం ఆమె ఎప్పటి నుంచి చేస్తోంది.. ఈమెకు సరుకు ఎక్కడి నుంచి వస్తుంది.. దీని వెనుక ఎవరెవరు ఉన్నారు.. ఎక్కడెక్కడ అమ్ముతోంది.. ఎవరెవరు కొంటున్నారు.. అన్న పూర్తి విషయాలను పోలీసులు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాగా.. ఊహకందని రీతిలో.. ఎవరికీ కనీసం అనుమానం కూడా రాకుండా పసుపు ప్యాకెట్లలో గంజాయి పెట్టి అమలు చేస్తున్న మహిళను నేహా భాయ్గా గుర్తించిన పోలీసులు.. ఆమెపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
మహిళ చెప్పిన వివరాల ప్రకారం.. స్థానిక దుకాణంలో తనిఖీలు చేయగా.. మరిన్ని గంజాయి నింపిన పసుపు ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) తిరుపతి యాదవ్, సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజ్తో పాటు వారి బృందం పాల్గొంది. ఈ వినూత్న స్మగ్లింగ్ పద్ధతిని వెలికి తీసినందుకు తిరుపతి యాదవ్ బృందాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్ రెడ్డి అభినందించారు.