by Suryaa Desk | Mon, Sep 16, 2024, 09:40 PM
నాగ్పుర్ (మహారాష్ట్ర)- సికింద్రాబాద్ మధ్య వందేభారత్ ఎక్స్ప్రెస్ పరుగులు పెట్టనున్న సంగతి తెలిసిందే. ఈ ట్రైన్ను ప్రధాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్ నుంచి నేడు వర్చువల్గా జెండా ఊపి ప్రారంభించనున్నారు. నాగ్పుర్లో బయల్దేరే ఈ ట్రైన్ సికింద్రాబాద్ స్టేషన్కు రాత్రి 10.45 గంటలకు చేరుకోనుంది. ఈ ట్రైన్కు స్వాగతం పలికేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు సికింద్రాబాద్ స్టేషన్లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్లకు ఇప్పటికే ఆహ్వానాలు పంపారు.
అయితే ఈ ట్రైన్ ఈనెల 19 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. వందే భారత్ ట్రైన్ ప్రతిరోజూ నాగపూర్ నుంచి ఉదయం 5 గంటలకు బయలుదేరి మద్యాహ్నం 12.15 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకుటుందని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్ నుంచి ప్రతిరోజూ మధ్యాహ్నం 1 గంటకు బయల్దేరి రాత్రి 8.20 గంటలకు నాగపుర్ చేరుకుంటుందన్నారు. కాజీపేట (వరంగల్), రామగుండం (కరీంనగర్), బల్లార్ష, చంద్రాపూర్, సేవగ్రాం స్టేషన్లలో హాల్టింగ్ ఉంటుందని చెప్పారు.
నాగ్పుర్-సికింద్రాబాద్ వందే భారత్ ట్రైన్ జోన్లో ప్రయాణించే వాటిలో అతిపెద్దదని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వెల్లడించారు. 20 కోచ్లతో ఈ ట్రైన్ నడుస్తుందన్నారు. సికింద్రాబాద్ నుంచి విశాఖ, తిరుపతి వెళ్లేవి 16 కోచ్లతో ప్రయాణికులకు సౌకర్యాలు అందిస్తున్నాయి. కాచిగూడ-బెంగళూరు వందేభారత్ ట్రైన్ 8 కోచ్లతో నడుస్తోంది. ఈ కొత్త వందేభారత్ ట్రైన్ మాత్రం మెుత్తం 20 కోచ్లతో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చనుంది. ఇందులో 2 ఎగ్జిక్యూటివ్, 18 ఛైర్ కార్ కోచ్లు ఉంటాయని అధికారులు వెల్లడించారు.
టికెట్ ధరల విషయానికొస్తే.. సికింద్రాబాద్- వరంగల్ వరకు ఏసీ ఛైర్కార్ రూ.710 ఉండగా.. ఎగ్జిగ్యూటివ్ ఛైర్కార్ రూ.1,195 ఉంది. సికింద్రాబాద్-రామగుండం వరకు ఏసీ చైర్కార్ రూ. 865 ఉండగా.. ఎగ్జిగ్యూటివ్ ఛైర్కార్ రూ. 1,510గా ఉంది. ఇక సికింద్రాబాద్ నుంచి చివరి స్టేషన్ నాగపుర్ వరకు ఏసీ ఛైర్కార్ ధర రూ.1500 ఉండగా.. ఎగ్జిగ్యూటివ్ ఛైర్కార్ ధర రూ. 2,785 గా నిర్ణయించారు.