by Suryaa Desk | Tue, Sep 17, 2024, 08:32 PM
సెప్టెంబర్ 17 తెలంగాణ బానిస సంకెళ్లు తెంచిన చారిత్రాత్మకమైన రోజు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ అంటే త్యాగమని.. నాటి తెలంగాణ సాయుధ పోరులో ఎందరో ప్రాణ త్యాగాలు చేశారని గుర్తు చేశారు. నిస్వార్థంగా తమ జీవితాలను పణంగా పెట్టి సర్వం కోల్పోయినా వెనుకంజ వేయని ఆ మహనీయుల త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ అని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున పబ్లిక్ గార్డెన్స్లో ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొని జాతీయ పతాకావిష్కరణ చేసిన సీఎం రేవంత్.. అనంతరం మాట్లాడుతూ.. ఆ నాటి అమరవీరులకు ఘన నివాళి అర్పించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇకపై ఈ శుభ దిన్నాన్ని ప్రజాపాలనా దినోత్సవంగా అధికారికంగా నిర్వహించనుందని చెప్పారు.
సాయుధ పోరాటం ఒక ప్రాంతానికో, ఒక కులానికో, ఒక మతానికో వ్యతిరేకంగా జరిగిన పోరాటం కాదని అన్నారు. ఒక జాతి తన స్వేచ్ఛ కోసం ఆత్మ గౌరవం కోసం రాచరిక పోకడలపై చేసిన తిరుగుబాటు అని వెల్లడించారు. నేడు తెలంగాణలో అత్యంత కీలకమైన రోజని.. అలాంటి రోజుపై కొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారని ఆక్షేపించారు. కొందరు విలీన దినోత్సవమని, కొందరు విమోచన దినోత్సవమని సంభోదిస్తున్నారని తాము మాత్రం అధికారికంగా ప్రజాపాలనా దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. నిజాం రాచరిక వ్యవస్థను కూలదోసి ప్రజాస్వామ్య ప్రస్థానానికి నాంది పలికిన రోజని అటువంటి ఈ రోజున రాజకీయాలకు తావు ఉండకూడదని చెప్పారు.
గత ప్రభుత్వ హయంలో విధ్వంసమైన తెలంగాణను మళ్లీ గాడిలో పెడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. పాలన పారదర్శకంగా ఉండాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని స్పష్టం చేశారు. గత పదేళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీ వెళ్లినా విమర్శలు చేస్తున్నారని.. రాజధాని ఢిల్లీ పాకిస్థాన్లోనో..బంగ్లాదేశ్లోనో లేదని చెప్పారు. తాను ఫాంహౌస్ సీఎంను కాదని.. పనిచేసే సీఎంను అని చెప్పారు. తెలంగాణ ప్రజల హక్కుల సాధన కోసం ఎన్ని సార్లైనా ఢిల్లీకి వెళ్తానని స్పష్టం చేశారు. తాము ప్రజల సంక్షేమ కోసం ఆలోచిస్తామని.. ప్రతిపక్షాల విమర్శలు పట్టించుకోమని తెలిపారు. కాగా, అంతకు ముందు సీఎం రేవంత్ గన్పార్క్ వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. ఇక ప్రజాపాలన దినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. శాసనసభ ఆవరణలో స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసనమండలి ఆవరణలో ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిలు జాతీయ పతాకివిష్కరణ చేశారు. జిల్లా కేంద్రాల్లో మంత్రులు జాతీయ జెండాను ఎగురవేశారు.