by Suryaa Desk | Thu, Sep 19, 2024, 12:40 PM
షరతులు లేకుండా రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ చలో ప్రజా భవన్ కు రైతులు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రజా భవన్ వద్ద పోలీసులు భద్రత పెంచారు.ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా గురువారం ప్రజా భవన్ ముందు పోలీసులు బారికేడ్లతో సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. మరో వైపు చలో ప్రజా భవన్ పిలుపు నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు, రైతు సంఘాల నేతలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నారు. కాగా ప్రతి కుటుంబానికి రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం.. ఇప్పటి వరకు కేవలం రూ.2 లక్షల లోపు రుణాలు మాత్రమే మాఫీ చేసిందని దీంతో రుణమాఫీ జరగని రైతులు ఆందోళనలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈమేరకు ఇవాళ ప్రజాభవన్ ముట్టడికి పిలుపునిచ్చారు.