by Suryaa Desk | Wed, Sep 18, 2024, 01:28 PM
సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణపై తన అక్కసును మరోసారి ప్రదర్శించాడని కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు రావుల రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పిలుపునివ్వగా, మండలశాఖ ఆధ్వర్యంలో మన్నెంపల్లి గ్రామంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నిరసన తెలిపారు. మండల అధ్యక్షుడు రావుల రమేష్ సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమానికి ఎలాంటి సంబంధం లేని నాయకుల విగ్రహాలను తెలంగాణ సచివాలయంలో పెట్టడాన్ని తెలంగాణ యావత్ సమాజం వ్యతిరేకిస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధిని పరిపాలనను గాలికి వదిలేసి విగ్రహాలు, విధ్వంసాలతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ సభ్యులు ఉల్లెంగుల పద్మ, నాయకులు సాయిల్ల కొమురయ్య, పొన్నం అనిల్ గౌడ్, పాశం అశోక్ రెడ్డి, బుడిగె పర్శరాములు, కొయ్యడ మురళి, ఖమ్మం కృష్ణ, కొమ్ము సంపత్, జగదీష్, సుధగోని సదయ్య గౌడ్, వేణుకుమార్, తిరుపతి, కొమురయ్య, కిషోర్, సంపత్, శ్రీనివాస్, సంపత్, తదితరులు పాల్గొన్నారు.