by Suryaa Desk | Tue, Sep 17, 2024, 07:16 PM
వరంగల్ నగరాన్ని తెలంగాణ రాష్ట్రాన్నికి రెండో రాజధానిగా తీర్చిదిద్దాలన్న సంకల్పం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుందని.. అందుకు తగిన కార్యాచరణ రూపొందిస్తున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని.. వరంగల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు . ఈ సందర్భంగా మాట్లాడిన పొంగులేటి.. వరంగల్ నగర అభివృద్ధిపై కీలక కామెంట్స్ చేశారు. చారిత్రాత్మక వరంగల్ నగర అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టిందని తెలిపారు. కాకతీయులు పాలించిన గొప్ప చరిత్ర ఉన్న వరంగల్ నగరాన్ని.. హైదరాబాద్కు ధీటుగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో కార్యాచరణ రూపొందిస్తున్నామని మంత్రి పొంగులేటి చెప్పుకొచ్చారు.
మరోవైపు.. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో సెప్టెంబర్ 17వ తేదీకి ఒక ప్రత్యేకత ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వివరించారు. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనమైన సెప్టెంబర్ 17వ తేదీని.. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా జరుపుకోవాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించిందని వెల్లడించారు. ఈ క్రమంలోనే.. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజాపాలనా దినోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని తెలిపారు. ఎందరో త్యాగధనుల పోరాటాల ఫలితంగానే ఈ రోజు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నామని.. వారందరినీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఆ త్యాగదనులందరి సేవలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్మరించుకున్నారు.
వరంగల్ నగరం వరద ముంపునకు గురికాకుండా.. అన్ని రకాల చర్యలు తీసుంటున్నట్టు మంత్రి పొంగులేటి తెలిపారు. వరద నీరు సాఫీగా వెళ్లిపోయేందుకు.. నగరవ్యాప్తంగా నాలాలను నిర్మిస్తున్నామని చెప్పుకొచ్చారు. వరంగల్ జిల్లాలో నిరాధారణకు గురైన.. కాకతీయ కాలంనాటి చారిత్రాత్మక దేవాలయాలను పునరుద్ధరించి నిత్యం పూజలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
గత ప్రభుత్వం వరంగల్లో నిర్మించ తలపెట్టిన కాళోజీ కళా క్షేత్రానికి శంకుస్థాపన చేసి గాలికి వదిలేసిందని.. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రాగానే కళాక్షేత్రం పనులను యుద్ధ ప్రతిపాదికన పూర్తి చేసినట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. త్వరలోనే.. కాళోజీ కళాక్షేత్రాన్ని ఘనంగా ప్రారంభించుకుందామని మంత్రి స్పష్టం చేశారు.