by Suryaa Desk | Thu, Sep 19, 2024, 04:16 PM
చదువుకుంటున్న విద్యార్థులు మారుతున్న జీవనశైలికి అనుగుణంగా ఆహారాన్ని తీసుకుంటేనే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని తాసిల్దార్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం ఆత్మకూరు మండలం పెద్దాపురం జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్ దామెర అనిత అధ్యక్షతన పోషణ అభియాన్ పథకం పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలకు పెరిగే వయసులో ఉన్నవారికి పౌష్టికాహారాన్ని అందించడం వల్లనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉంటారన్నారు. అప్పుడే ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను శ్రద్ధగా వినడంతో పాటు చదువుల్లో రాణిస్తారు అన్నారు.
ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం నిరుపేద విద్యార్థులకు అందిస్తున్న పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. పిల్లలకు సమతుల్య ఆహారం అందించడం వల్ల ఎదుగుదల చురుకుతనము ఉంటుందన్నారు. మండలం లోని అంగన్వాడీ టీచర్లు తీసుకువచ్చిన రకరకాల పిండి వంటలను, విద్యార్థులకు అందించారు. నిత్యజీవితంలో చిరుధాన్యాలతో చేసుకున్న వంటలను స్వీకరిస్తే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ దామెర అనిత అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ స్పందన, అంగన్వాడి సూపర్వైజర్లు నస్రిమా, పద్మావతి, ఉమెన్ కోఆర్డినేటర్ కళ్యాణి, అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు