by Suryaa Desk | Thu, Sep 19, 2024, 04:35 PM
భవిష్యత్తులో వచ్చే భారీ వరదలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు మనమంతా పకడ్బందీగా సిద్దం కావాలని, వరదల సమయంలో పాటించాల్సిన స్టాండర్డ్ ఆపరేషన్ ప్రోసీజర్ ను కట్టుదిట్టంగా అమలు చేయాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఖమ్మం నగరంలోని మున్నేరు నది వరద ప్రభావిత ప్రాంతమైన కరుణగిరిలో పర్యటించారు. సెయింట్ జోసఫ్ మేజర్ సెమినార్ చర్చ్ హాల్ లో చర్చ్ క్రిస్టియన్ సంబంధిత యాజమాన్యం, అధికారులతో కలిసి భవిష్యత్తులో డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై చర్చించారు.
అంధుల, మూగవారికి సంబంధించిన జ్యోతి నివాస్ స్కూల్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గంటల వ్యవధిలో కుంభవృష్టి వర్షం పడటంతో మున్నెరు గతంలో ఎన్నడూ లేనంతగా భారీగా వరదలు వచ్చాయన్నారు. ఖమ్మం నగరంలో వచ్చిన భారీ వరదల నేపథ్యంలో అందుబాటులో ఉన్న బృందాలు, సిబ్బందితో ప్రజల ప్రాణాలు రక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి వరదలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పాటించాల్సిన పద్ధతులపై స్టాండర్డ్ ఆపరేషన్ ప్రోసీజర్ రూపొందించుకొని కట్టుదిట్టంగా అమలు చేయాలని కలెక్టర్ తెలిపారు. వరదల సమయంలో ప్రజలను అప్రమత్తం చేసేందుకు సైరెన్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ తెలిపారు. విపత్కర సమయంలో వినియోగించేందుకు వీలుగా శాశ్వతంగా 1077 టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో శిక్షణ సహాయ కలెక్టర్ మ్రుణాళ్ శ్రేష్ఠ, రూరల్ తహసీల్దార్ రాంప్రసాద్, చర్చి రెక్టార్ జయరాజు, ఫైనాన్స్ సుధాకర్, సోషల్ సర్వీస్ ప్రతినిధి సురేష్, కార్యదర్శి విజయ్ రీసెర్చర్ చార్లెస్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.