by Suryaa Desk | Tue, Sep 17, 2024, 03:58 PM
సాధారణంగా భారీ గణేశుడు అంటే అందరికీ ఖైరతాబాద్ గణనాథుడు, లడ్డూ అంటే బాలాపూర్ వినాయకుడి ప్రసాదం గుర్తుకు వస్తుంది. బాలాపూర్ లడ్డూ ఈసారి రూ.30 లక్షలు పలికింది. అయితే హైదరాబాద్లోని బండ్లగూడ జాగీర్లో గణేశ్ లడ్డూ రికార్డ్ ధర పలికింది. కమ్యూనిటీ సభ్యులు అందరూ కలిసి లడ్డూను రూ.1.87 కోట్లకు దక్కించుకున్నారు.ఇక్కడి కీర్తి రిచ్మండ్ విల్లాస్లో జరిగిన వేలంపాటలో విల్లాలోని కమ్యూనిటీ మొత్తం కలిపి లడ్డూను దక్కించుకుంది. గత ఏడాది కూడా ఈ లడ్డూకు వేలంలో అత్యధిక ధర పలికింది. విల్లాలోని కమ్యూనిటీ మొత్తం కలిపి గత ఏడాది రూ.1.26 కోట్లకు లడ్డూను సొంతం చేసుకుంది. అయితే ఈ మొత్తాన్ని చారిటీ కోసం వినియోగిస్తామని విల్లా కమ్యూనిటీ తెలిపింది.ఇక్కడ 2016 నుంచి వేలం ప్రారంభమైందని, అప్పుడు రూ.25,000తో ప్రారంభమైనట్లు ఓ కమిటీ సభ్యుడు తెలిపారు. తమ కమ్యూనిటిలోని విల్లాల్లో పని చేసేవారి పిల్లల చదువుల కోసం వేలంలో వచ్చే మొత్తాన్ని వినియోగించాలని ఆ రోజు నిర్ణయించుకున్నామన్నారు. ఇప్పుడు ఎనిమిదేళ్ళవుతోందని, వేలంలో ఈ లడ్డూ రూ.25 వేల నుంచి ఇప్పుడు రూ.1.87 కోట్లకు చేరుకుందన్నారు. ఇందులోని మొత్తం డబ్బును చారిటీకే ఇస్తామన్నారు. ఈసారి 42 ఎన్జీవోలతో జతకట్టామని, వాటి ద్వారా సహాయం అందిస్తామన్నారు.