by Suryaa Desk | Tue, Sep 17, 2024, 07:12 PM
సైబర్ మోసాలకు అంతే లేకుండా పోతోంది. అవకాశమున్న ఏ దారిని సైబర్ నేరగాళ్లు వదిలిపెట్టకుండా.. అమాయకులను మోసం చేస్తూ దొరికినకాడికి దోచేస్తున్నారు. రోజుకో తరహా కొత్త మోసాలు బయటపడుతున్నాయి. సులభంగా డబ్బు సంపాధించాలన్న సామాన్యుల ఆశనే అసరాగా తీసుకుని.. సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇటీవలే.. సూళ్లు, కాలేజీలకు వెళ్లతున్న అమ్మాయిల తల్లిదండ్రులను టార్గెట్గా చేసుకుని.. వారి పిల్లలను కిడ్నాప్ చేశామని బెదిరిస్తూ డబ్బులు కాజేశారు. కాగా.. ఇప్పుడు ఏకంగా.. దేశాన్ని రక్షించే ఆర్మీ అధికారుల పేరు చెప్పుకుని మోసాలకు పాల్పడుతున్నారు.
పగలనకా రాత్రనకా.. దేశ రక్షణలో ప్రాణాలను సైతం అర్పించుకునే ఆర్మీ అధికారుల పేర్లను వాడుకుని.. సైబర్ నేరాలకు తెరతీశారు కేటుగాళ్లు. ఆర్మీ అధికారులమంటూ సామాన్యులకు వాట్సప్ కాల్స్ చేస్తూ.. డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. పైగా.. అమాయకులను నమ్మించేందుకు డీపీలో ప్రధాన మంత్రితో కలిసి ఆర్మీ అధికారులు తీసుకున్న ఫొటోలను డీపీలుగా పెట్టుకుంటున్నారు. దీంతో.. సామాన్యులు నిజమేనని నమ్మి సైబర్ కేటుగాళ్ల ఉచ్చులో పడి మోసపోతున్నారు. కాగా... ఇలాంటి ఫేక్ కాల్స్ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వస్తున్నాయని.. టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు.
సైబర్ నేరాలపై ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ప్రజలకు అవగాహాన కల్పించే సజ్జనార్.. ఇప్పుడు ఈ కొత్త తరహా మోసం గురించి పోస్ట్ చేసి.. నెటిజన్లలో కొంత అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. ఆర్మీ అధికారులమంటూ సామాన్యులకు వాట్సాప్ కాల్స్ వస్తున్నాయని.. ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని సజ్జనార్ సూచించారు. తనకు తెలిసిన ఒకరికి... 7015591204 అనే నెంబర్ నుంచి వాట్సాప్ కాల్ వచ్చిందని తెలిపారు. అయితే.. అటు నుంచి మాట్లాడిన వ్యక్తి.. తాను ఇండియన్ ఆర్మీలో మేజర్ ర్యాంక్ అధికారినంటూ పరిచయం చేసుకున్నట్టు తెలిపారు.