by Suryaa Desk | Thu, Sep 19, 2024, 02:47 PM
గ్రామీణ ఓటర్ జాబితాను పకడ్బందీగా రూపొందించేందుకు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ సంపూర్ణ సహకారం అందజేయాలని, ఓటరు జాబితా రూపకల్పనపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష కోరారు.మంగళవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో గ్రామీణ ఓటర్ల జాబితా రూపకల్పన పై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణశ్రీ తో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, గ్రామ పంచాయతీలకు 2వ సాధారణ ఎన్నికల నేపథ్యంలో గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా రూపకల్పనకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిందని, ఈ షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 13న గ్రామ పంచాయతీలలో వార్డుల వారీగా ఓటరు జాబితా సిద్ధం చేసి గ్రామ పంచాయతీ కార్యాలయాలలో ప్రదర్శించడం.
జరిగిందని కలెక్టర్ తెలిపారు.డ్రాఫ్ట్ ఓటరు జాబితాలో గల అభ్యంతరాలు, నూతన ఓటర్ నమోదు దరఖాస్తులను సెప్టెంబర్ 21 లోపు సంబంధిత మండలాల ఎంపీడీఓలకు లిఖిత పూర్వకంగా సమర్పించాలని, సెప్టెంబర్ 26 లోపు అభ్యంతరాలను పరిష్కరించి, సెప్టెంబర్ 28న తుది ఓటర్ జాబితా విడుదల చేయడం జరుగుతుందని అన్నారు.ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి వీర బ్రహ్మయ్య, సిపిఐ పార్టీ ప్రతినిధి టి. సదానందం, తెదేపా పార్టీ జిల్లా అధ్యక్షులు ఎ.తిరుపతి, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి శశి భూషణ్, భారాసా పార్టీ ప్రతినిధి ఉప్పు రాజ్ కుమార్, భాజాపా పార్టీ జిల్లా జనరల్ సెక్రెటరీ పి.సంపత్ రావు, సిపిఎం పార్టీ ప్రతినిధి ముత్యం రావు, బీఎస్పీ పార్టీ ప్రతినిధులు శారద రాజ నర్సింగ్, కాంగ్రెస్ పార్టీ రామగుండం ఇన్చార్జి ఆశ్ పాషా, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.