by Suryaa Desk | Tue, Sep 17, 2024, 09:20 PM
తెలంగాణలో గత 15 రోజుల క్రితం భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వర్షాలు దంచికొట్టాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. జలాశయాలు, ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. వర్షాలు, వరదలకు ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు అతాలకుతలం అయ్యాయి. మెుత్తం 33 మంది ప్రాణాలు కోల్పోయారు. 10 వేల కోట్లకు పైగా ఆస్తి నష్టం సంభవించింది. ఈ నేపథ్యంలో గత వారం రోజులుగా వరుణుడు బ్రేక్ ఇచ్చాడు.
అయితే నేడు రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడిందన్నారు. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై తక్కువగానే ఉన్నా.. పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు. తెలంగాణలో పలు జిల్లాల్లో చిరు జల్లులు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. బుధవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురిసే ఛాన్స్ ఉందన్నారు. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కి.మీ వేగంతో వీస్తాయన్నారు.
ఆకాశం మేఘావృతమై ఉంటుందని.. ఉదయం కాసేపు ఎండకాసినా కాసేపటికి వాతావరణం చల్లబడి పలు చోట్ల జల్లులు కురుస్తాయన్నారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో నేడు వర్షాలకు ఆస్కారం ఉందని చెప్పారు. ఇక ఏపీ కోస్తాంధ్రపై బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం కాస్త ఉండంతో అక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. అయితే రానున్న మరో 3 రోజుల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడి అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ప్రస్తుతానికి బంగ్లాదేశ్, ఒడిశా, బెంగాల్, ఏపీ రాష్ట్రాల్లో ఎక్కువగా వర్షాలు కురుస్తున్నాయన్నారు. నేడు ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా, కాకినాడ, పశ్చిమ గోదావరి, కోనసీమ, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అనకాపల్లి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసినా.. భారీ వర్షాలకు మాత్రం అవకాశం లేదని అన్నారు.