by Suryaa Desk | Tue, Sep 17, 2024, 10:22 AM
ప్రస్తుతం డేటా వినియోగం భారీగా పెరుగుతోంది. ఇంర్నెట్ విస్తృతి పెరగడం, అన్ని రంగాల్లో డేటా వినియోగం అనివార్యంగా మారడంతో డేటా కేంద్రాలు విస్తృతంగా అందుబాటులోకి వస్తున్నాయి.ఈ నేపథ్యంలోనే అమెరికా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ పెద్ద ఎత్తున డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగానే హైదరాబాద్లో డేటా సెంటర్లను పెద్దఎత్తున ఏర్పాటు చేస్తోంది.ఇప్పటికే షాద్నగర్ సమీపంలోని కొత్తూరు, చందన్వెల్లి, ఎలికట్ట గ్రామాల వద్ద సంస్థ, స్థల సేకరణ చేసింది. ఎలికట్టలో 22 ఎకరాలస్థలాన్ని కొనుగోలు చేయడమే కాకుండా, డేటా సెంటర్ నిర్మాణాన్ని మొదలు పెట్టింది. చందన్వెల్లి, కొత్తూరు గ్రామాల పరిధిలో నూతన డేటా కేంద్రాలు ఏర్పాటు చేయడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని స్థలాన్ని సేకరించింది. ఇదిలా ఉంటే మైక్రోసాఫ్ట్ భవిష్యత్తు అవసరాల కోసం ఇంకా స్థలాన్ని సేకరిస్తూనే ఉంది.
ఇందులో భాగంగానే తాజాగా కొత్తూరు- షాద్నగర్ ప్రాంతంలో మరో 40 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసేందుకు మైక్రోసాఫ్ట్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. రానున్న రెండు నెలలల్లో ఈ కొనుగోలు ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. డేటా కేంద్రాలకు మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ను కేంద్రంగా చేసుకున్నట్లు దీనిబట్టి అర్థమవుతోంది. మైక్రోసాఫ్ట్ తీసుకున్న ఈ నిర్ణయంతో హైదరాబాద్ ఐటీ రంగానికి మరింత మేలు జరగడం ఖాయమని ఐటీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
డేటా కేంద్రాల నిర్మాణంపై వచ్చే 15 ఏళ్లలో మైక్రోసాఫ్ట్ రూ. 15,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దీంతో భారీగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇదిలా ఉంటే మైక్రోసాఫ్ట్ దేశంలో ఇతర ప్రదేశాల్లో కూడా డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తుండగా హైదరాబాద్కే పెద్ద పీట వేయడం విశేషం. దీంతో రానున్న రోజుల్లో డేటా సెంటర్లకు హైదరాబాద్ అడ్డాగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.