by Suryaa Desk | Sun, Sep 15, 2024, 07:58 PM
ఎస్సారెస్పీ టెయిల్ ఎండ్ ప్రాంతాల సాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు పత్తిపాక రిజర్వాయర్ నిర్మిస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు.శనివారం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పెద్దపల్లి జిల్లాలో రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష లతో పాటు విస్తృతంగా పర్యటించారు.
జూలపల్లి మండలం కాచాపూర్ గ్రామంలోని 132 కేవి సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు, పెద్దపల్లి మండలం రాఘవపూర్ గ్రామంలోని 33/11 కేవి సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు , ఎస్ఈ ఎన్.పి.డి.సి.ఎల్ బోన నిర్మాణ పనులకు, పెద్దపల్లి పట్టణంలోని మార్కెట్ యార్డ్ 33/11 కేవి సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు, పెద్దరాతి పల్లి 33/11 కేవి సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు, అమృత్ 2.0, టి.యూ.ఎఫ్.ఐ.డి.సి కింద చేపట్టిన త్రాగునీటి సరఫరా పనులకు, రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయ భవన నిర్మాణ పనులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.
అనంతరం జెండా చౌరస్తా ప్రాంగణంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర బడ్జెట్ లో పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణానికి అవసరమైన నిధులు కేటాయించడం జరిగిందని, ప్రజల చిరకాల వాంఛ పత్తిపాక తప్పనిసరిగా నిర్మిస్తామని అన్నారు. దేశ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ప్రాజెక్టు లే ఆధునిక దేవాలయాలు అనే భావించి ఎస్సారెస్పీ ప్రాజెక్టు నిర్మించడం వల్లే పెద్దపల్లి ప్రాంతం అభివృద్ధి చెందిందని అన్నారు.
పెద్దపల్లి బైపాస్ రోడ్డు, ఓదెల మండలంలో మానేరు నదిపై బ్రిడ్జి నిర్మాణ పనులు సైతం ప్రజా ప్రభుత్వం మంజూరు చేసి సకాలంలో పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుపై ఉన్న లిఫ్ట్ కోసం అవసరమైన సబ్ స్టేషన్ నిర్మాణ పనులను వెంటనే మంజూరు చేస్తామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు.
ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రేవంత్ రెడ్డి నాయకత్వంలో వచ్చిందని, ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం ప్రజల అవసరాల కోసం మాత్రమే ఉంటుందని అన్నారు. పెద్దపల్లిలో భవిష్యత్తు అవసరాలు దృష్టిలో పెట్టుకుని 30 కోట్ల రూపాయలతో 5 సబ్ స్టేషన్ పనులు శంకుస్థాపన చేయడం జరిగిందని అన్నారు. అమృత్ 2.0 , టి.యూ.ఎఫ్.ఐ.డి.సి క్రింద 50 కోట్ల నిధులతో త్రాగునీటి సరఫరా పనులకు శంకుస్థాపన చేశామని అన్నారు.ప్రజల భావోద్వేగాలను దృష్టిలో ఉంచుకొని 10 వేల కోట్ల రూపాయలతో పెద్దపల్లి జిల్లాలో 800 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ నిర్మాణం మంజూరు చేశామని అన్నారు.మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల వ్యవధిలో ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించామని అన్నారు. ప్రతినెల మహిళ ఉచిత బస్సు ప్రయాణానికి ప్రభుత్వం 400 కోట్లు ఖర్చు చేస్తుందని ఉపముఖ్యమంత్రి తెలిపారు.
మహిళా సంఘాలు ఆర్థికంగా ఎదిగే దిశగా ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద మహిళా సంఘాలకు రాబోయే ఐదు సంవత్సరాలలో లక్ష కోట్లు వడ్డీ లేని రుణాలు అందించడం జరుగుతుందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున సోలార్ ప్లాంట్లు తీసుకొని వస్తామని, వీటిని మహిళా సంఘాల ద్వారా ఏర్పాటు చేసే ప్రతిపాదనలు పరిశీలిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు.
జూలపల్లి మండలం కాచాపూర్ గ్రామంలో 132/33 కేవి సబ్ స్టేషన్ నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశామని, పైలెట్ ప్రాజెక్టు కింద అక్కడ సమీపంలో మరో 12 ఎకరాల భూమి సేకరించి మహిళల ద్వారా సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. ప్రభుత్వం కల్పించే ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ మహిళలు ఆర్థికంగా ఎదగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ,ఎంపీ గడ్డం వంశీకృష్ణ, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ అడ్లూరు లక్ష్మణ్ కుమార్, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ , అదనపు కలెక్టర్ లు జే.అరుణ శ్రీ, జి.వి. శ్యామ్ ప్రసాద్ లాల్, ఆర్డిఓలు బి.గంగయ్య, వి.హనుమా నాయక్, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.