by Suryaa Desk | Tue, Sep 17, 2024, 08:28 PM
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా చేయలేదని.. రేవంత్ రెడ్డికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అయితే.. రాజాసింగ్ కృతజ్ఞతలు తెలిపింది.. ఎందుకో కాదు.. హైదరాబాద్లో అట్టహాసంగా సాగుతున్న వినాయక నిమజ్జనాలను ఆయనే స్వయంగా వచ్చి పర్యవేక్షించటం గురించి. గణేశ్ నిమజ్జన ఏర్పాట్లపై రాజాసింగ్ హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం (సెప్టెంబర్ 17న) రోజున.. బాలాపూర్ గణేశ్ నిమజ్జన శోభాయాత్రలో పాల్గొన్న రాజాసింగ్.. ఈమేరకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈసారి ప్రభుత్వంలోని వ్యవస్థలు చాలా బాగా పని చేశాయని ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థ పనితీరు చాలా బాగుందని రాజాసింగ్ మెచ్చుకున్నారు.
గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల నుంచి నిమజ్జనం వరకు అన్నింటినీ.. ఎప్పటికప్పుడు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా సమీక్షించటం అభినందనీయమని.. రాజాసింగ్ కొనియాడారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి రాజాసింగ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా.. ఈసారి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించడం సంతోషకరంగా ఉందని రాజాసింగ్ తెలిపారు.
అలాగే.. ఖైరతాబాద్ మహాగణపతి మండపాన్ని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారని.. తొలిపూజ కూడా చేసినట్టుగా రాజాసింగ్ గుర్తు చేశారు. అయితే.. ఎండ కారణంగా నిమజ్జనాలు కొంత ఆలస్యంగా జరిగాయని.. కానీ మిగతా అన్ని ఏర్పాట్లు, వ్యవస్థల పనితీరు చాలా బాగున్నాయని రాజాసింగ్ అభిప్రాయపడ్డారు.
అయితే.. మంగళవారం (సెప్టెంబర్ 17న) రోజున హైదరాబాద్లో మహానిమజ్జన కార్యక్రమం ఘనంగా జరుగుతున్న వేళ.. ఈ వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పాల్గొన్నారు. ఉదయం 11 గంటల సమయంలో తన నివాసం నుంచి నేరుగా ట్యాంక్బండ్ వద్దకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. నెక్లెస్ రోడ్ మార్గంలో ఫుట్పాత్పై కలియ తిరిగారు. ఏర్పాట్ల గురించి హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్,
ఈ క్రమంలోనే.. క్రేన్ ఆపరేటర్లతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. విగ్రహాల నిమజ్జన సమయంలో వాళ్లు పాటించే జాగ్రత్తల గురించి అడిగి మరీ తెలుసుకున్నారు. మరోవైపు.. అక్కడే విధులు నిర్వహిస్తున్న జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులతోనూ రేవంత్ రెడ్డి ముచ్చటించారు. వారి సాధక బాధకాలను విన్నారు. వారు ఎదుర్కొంటోన్న సమస్యలు విని.. త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.