by Suryaa Desk | Tue, Sep 17, 2024, 07:02 PM
ఇదేందయ్యా ఇది.. ఇది నేనెప్పుడూ చూడలా.. అనేలా కొన్ని సన్నివేశాలు మాత్రమే జరుగుతుంటారు. ఈ సీన్ చూస్తే అచ్చంగా ఇదే ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే.. వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగ దొరికితే.. ఎవరైనా ఏం చేస్తారు. చెట్టుకో, స్తంభానికో కట్టేసి వీపు చింతపండు చేస్తారు. ఆ తర్వాత పోలీసులకు అప్పజెప్తారు. అచ్చంగా ఇదే జరిగింది నల్గొండ జిల్లాలో నార్కట్ పల్లి మండలం ఎల్లారెడ్డి గూడెం గ్రామంలో. కానీ.. మధ్యలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.
దొంగకు దేహశుద్ధి చేస్తున్న క్రమంలో.. తనకు ఆకలవుతుందని దొంగ చెప్పటంతో.. అప్పటివరకు కోపంతో ఊగిపోయిన యువకులు ఒక్కసారిగా ఆగిపోయారు. ఆ దొంగ చెప్పిన ఆ మాట.. వారిలో ఉన్న మానవత్వాన్ని తట్టి లేపింది. అక్కడున్నది దొంగ అని తెలిసినప్పటికీ.. ఆకలి అందరికీ ఆకలే అన్న విషయాన్ని గుర్తెరిగి.. అతని ఆకలిని తీర్చటం ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తోంది.
ఇళ్లల్లోకి చొరబడి వరుస చోరీలకు పాల్పపడుతున్న గణేశ్ అనే దొంగను స్థానికులు పట్టుకున్నారు. కొన్ని రోజులుగా తాళాలు వేసిన ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని.. దొంగతనాలకు పాల్పపడుతున్నట్లు స్థానికులు గుర్తించారు. వరుసగా దొంగతనాలు జరుగుతుండటంతో.. దొంగను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని పక్కా ప్లాన్ వేశారు. అనుకున్నట్టుగానే దొంగ అయిన గణేష్.. స్థానికులు వేసిన వలలో చిక్కాడు. ఇంకేముంది.. పట్టుకున్న వెంటనే కోపంతో ఊగిపోతున్న యువకులు.. అక్కడే ఓ స్తంభానికి గణేష్కు కట్టేసి చితకబాదారు.
అయితే.. కొద్దిసేపటికి గణేశ్ తనకు ఆకలి వేస్తుందని దీనంగా అడగటంతో ఆ యువకుల మనసు కరిగిపోయింది. ఎంత దొంగ అయినా.. ఆకలితో ఉన్న మనిషి కడుపు నింపడం ధర్మమని భావించి.. అప్పటి వరకు కొట్టిన చేతులతోనే.. తినిపించి అతని కడుపునింపారు. అక్కడే వినాయకుడికి నైవేద్యంగా పెట్టిన పులిహోరను ఓ ప్లేట్లో తీసుకొచ్చి స్వయంగా ఓ యువకుడు గణేష్కు తినిపించాడు. అనంతరం మంచినీళ్లు కూడా తాగించారు.
అనంతరం.. ఆ దొంగ వివరాలు అడిగి తెలుసుకున్నారు. గతంలో ఆలయాల్లోని హుండీల్లో డబ్బులు దొంగలించేవాడినని.. తెలిపాడు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించిన యువకులు.. దొంగను వాళ్లకు అప్పగించారు. కోపంలోనూ కారుణ్యం ప్రదర్శించిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కాగా.. ఆ యువకులు ప్రదర్శించిన ధర్మాన్ని, దొంగపట్ల చూపించిన మానవత్వాన్ని నెటిజన్లు.. మెచ్చుకుంటున్నారు.