by Suryaa Desk | Mon, Sep 16, 2024, 01:00 PM
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని బంగారుపల్లి గొత్తికోయగుంపు అటవీ ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడ శాశ్వత నిర్మాణాలకు అటవీశాఖ అనుమతించదు. ఈ తండాలోని పిల్లలు సౌకర్యవంతంగా లేని ఓ గుడిసెలో విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు.ఓ ఉపాధ్యాయిని, ప్రధానోపాధ్యాయుడు ఉన్నారు. కొత్త పాఠశాల భవన నిర్మాణానికి అటవీ అధికారులు అనుమతులివ్వలేదు. ఈ క్రమంలో కలెక్టర్ దివాకర వినూత్నంగా ఆలోచించి కంటెయినర్(ప్రీ ఫ్యాబ్రికేటెడ్) పాఠశాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. కలెక్టర్ నిధులు రూ.13 లక్షలతో చేపట్టిన ఈ పనులు పూర్తికావొచ్చాయి. వచ్చే వారంలో మంత్రి సీతక్క చేతుల మీదుగా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ కంటెయినర్ పాఠశాల 25 అడుగుల వెడల్పు, 25 అడుగుల పొడవు ఉంటుంది. ఇందులో 12 వరకు డ్యూయల్ డెస్కులతోపాటు ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు కూర్చోవడానికి 3 కుర్చీలు పట్టే స్థలం ఉంటుంది. రాష్ట్రంలో కంటెయినర్ దుకాణాలు, ఇళ్లు నిర్మిస్తున్నప్పటికీ.. ప్రభుత్వ పాఠశాలగా తీర్చిదిద్దడం ఇదే తొలిసారి.