by Suryaa Desk | Sun, Sep 15, 2024, 08:45 PM
తెలంగాణ కాంగ్రెస్ కొత్త సారధి బాధ్యతలు స్వీకరించారు. టీపీసీసీ నూతన చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ కు గాంధీభవన్ లో రేవంత్ బాధ్యతలు అప్పగించారు. అనేక తర్జన భర్జనల తరువాత ఏఐసీసీని టీపీసీసీ చీఫ్ గా నియమించింది.ఇప్పుడు రేవంత్ కు జోడిగా తెలంగాణలో పార్టీని నడిపించాల్సిన మహేష్ ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. దీంతో, మహేష్ పని తీరు ఎలా ఉండబోతోందనే చర్చ మొదలైంది.మహేష్ కుమార్ బాధ్యతల స్వీకరణకు పార్టీ నేతలు హాజరయ్యారు. తన ఇంటి నుంచి భారీ ర్యాలీతో గాంధీ భవన్ కు చేరుకున్నారు.ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ ఇంచార్జ్ కార్యదర్శులు, మంత్రులు, ముఖ్య నాయకులు హాజరయ్యారు. తెలంగాణలో పదేళ్ల తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ను ఇప్పుడు టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ నడిపించాల్సి ఉంది. సీఎం రేవంత్ తో కలిసి పార్టీ - ప్రభుత్వం మధ్య సమన్వయం పీసీసీ చీఫ్ గా మహేష్ ముందు ఉన్న అసైన సవాల్. ఇక..త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయి.
కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తరువాత మరింత బలోపేతం దిశగా ఏఐసీసీ ఫోకస్ చేసింది. రాష్ట్రంలో పార్టీలో జరిగే ప్రతీ నిర్ణయం ఏఐసీసీ ఆమోదం తరువాతనే ప్రకటిస్తున్నారు. ఇప్పటికే ప్రబుత్వం ఏర్పడి తొమ్మది నెలలు పూర్తయినా నామినేటెడ్ పదవులు పూర్తి స్థాయిలో భర్తీ చేయలేదు. ఇక, మంత్రివర్గ విస్తరణ పైన హైకమాండ్ అనుమతి ఇవ్వలేదు. ఇదే సమయంలో ఇప్పుడు పీసీసీకి కొత్త కార్యవర్గం ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ సమయంలో మంత్రి పదవులు దక్కనివారు..పీసీసీ కోసం పోటీ పడిన వారిని మహేష్ పార్టీ అధ్యక్షుడిగా సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది.
ఇక, త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా సీఎం రేవంత్ - మహష్ కు పరీక్షగా మారనున్నాయి. పార్టీ నేతలతో మహేష్ మంచి సంబంధాలే ఉన్నా.. పదవులు ఆశించిన సీనియర్లను కలుపుకొని పోవటమే సమస్యగా మారనుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల ఖరారు నుంచి విజయం వరకు ప్రతీ అడుగు కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. అటు బీఆర్ఎస్, బీజేపీ కాంగ్రెస్ లక్ష్యంగా రాజకీయ దాడి పెంచాయి. దీంతో..ఇటు పార్టీని సమన్వయం చేసుకుంటూ.. ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కొంటూ..2028 ఎన్నికలే లక్ష్యంగా మహేష్ ఎలా పార్టీని ముందుకు నడిపిస్తారనేది వేచి చూడాల్సిందే.