by Suryaa Desk | Sat, Sep 14, 2024, 07:33 PM
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలు, పార్కులు, నాలాలు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురి కాకుండా తెలంగాణ ప్రభుత్వం హైడ్రా పేరుతో కొత్త వ్యవస్థను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ హైడ్రా అధికారులు నగరంలోని పలు అక్రమ కట్టడాలను నేలమట్టం చేశారు. చెరువులు, కుంటలు ఆక్రమించి వాటి బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన కట్టడాలను కూల్చేశారు. ఈ హైడ్రాను మరింత పటిష్ఠం చేసేందుకు గాను ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రత్యేకంగా పోలీసు సిబ్బందిని కూడా కేటాయించారు. సీఐలు, ఎస్ఐలతో పాటు మరికొంత మంది పోలీసు సిబ్బందిని విధులకు కేటాయించారు.
ఈ సిబ్బంది చెరువులు ఆక్రమణలకు గురి కాకుండా చర్యలు తీసుకోనుంది. ఇక ఈ క్రమణలకు చెక్ పెట్టేందుకు హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. చెరువులకు రక్షణ కల్పించాలని హైడ్రా కమిషన్ రంగనాథ్ భావిస్తున్నారట. అందుకోసం ఒక్కో చెరువు వద్ద ఇద్దరేసి చొప్పున సెక్యూరిటీ గార్డులను నియమించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ సెక్యూరిటీ గార్డులు 24 గంటలు చెరువులు, కుంటల వద్ద కాపలా కాయనున్నారు. ఆయా పరిధిలో ఎటువంటి అక్రమ నిర్మాణాలు చేపట్టినా.. వెంటనే హైడ్రాకు సమాచారం ఇస్తారు. భవిష్యత్లో ఒక్క చెరువు కబ్జాకు గురి కాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అలాగే చెరువుల చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మానిటరింగ్ చేయనున్నట్లు సమాచారం.
ప్రస్తుతం హైదరాబాద్ నగర పరిధిలో 450 వరకు చెరువులు ఉన్నాయి. ఇందులో ఔటర్ రింగు రోడ్డులోని మున్సిపాలిటీలు, పంచాయతీల్లో 300 దాక చెరువులు ఉన్నాయి. ఈ చెరువుల వద్ద ముందుగా సెక్యూరిటీని ఏర్పాటు చేయాలని హైడ్రా అధికారులు భావిస్తున్నారు. ముందుగు గార్డులను ఏర్పాటు చేసి సక్సెస్ అయితే.. మిగతా చెరువుల వద్ద గార్డులను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు మెుదలుపెట్టనున్నారు. ఇదిలా ఉండగా.. నాలాల పరిరక్షణకు కూడా హైడ్రా ప్లాన్ చేస్తుంది. నాలాల బఫర్ జోన్ నిర్ధారించేందుకు సర్వే చేపడుతోంది. కాగా, గత వారం హైడ్రా నగరంలోని పలు ప్రాంతాల్లో కూల్చేవేతలు చేపట్టగా.. ప్రస్తుతం సైలెంట్గా ఉంది. ఈ ఆదివారం కూడా కూల్చివేతలు ఉండే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
హైడ్రా చర్యలపై హైకోర్టు అసంతృప్తి..ఇక హైడ్రా కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎలాంటి నోటీసులు, సమయం ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నోటీసులు ఇవ్వకుండా, వివరణ తీసుకోకుండా నిర్మాణాలు ఎలా కూల్చివేస్తారని హైడ్రాను ప్రశ్నించింది .హైడ్రాకు ఉన్న అధికారాలను సవాల్ చేస్తూ లక్ష్మి అనే మహిళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. విచారణ జరిపిన న్యాయస్థానం.. జీవో 99పై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.