by Suryaa Desk | Sat, Sep 14, 2024, 07:35 PM
హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఎపిసోడ్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. గాంధీపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. పాడి కౌశిక్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ గచ్చిబౌలి పోలీసులు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. గాంధీతో పాటుగా ఆయన కుమారుడు, సోదరుడుపై కూడా కేసులు పెట్టారు. జీహెచ్ఎంసీకి చెందిన మరో ఇద్దరు కార్పొరేటర్లు శ్రీంకాంత్, వెంకటేష్ గౌడ్లపైనా పోలీసులు హత్యాయత్నం కేసులు నమోదు చేశారు.
అరెకపూడి గాంధీకి పీఏసీ ఛైర్మన్ పదవి ఇవ్వడంతో బీఆర్ఎస్ నేతలు గత నాలుగు రోజులుగా తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిపక్షాలకు ఇవ్వాల్సిన పదవి పార్టీ మారిన గాంధీకి ఇచ్చారని పాడి కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నట్లయితే గులాబీ కండువా కప్పుకోవాలని ఆయన ఇంటిపై జెండా ఎగురవేయాలని చెప్పారు. తానే గాంధీ ఇంటికి వెళ్లి జెండా ఎగురవేస్తాని రెండ్రోజుల (ఈనెల 12) క్రితం సవాల్ విసిరారు. తీవ్రంగా స్పందించిన గాంధీ.. కౌశిక్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
రాళ్లు, కోడి గుడ్లతో కౌశిక్ రెడ్డిపై దాడి.. గాంధీ అనుచరుల వీరంగం
అనంతరం తన అనుచరులతో కలిసి కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్లారు. ఈ క్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. కౌశిక్ రెడ్డి ఇంటిపై రాళ్లు, కోడిగుడ్లతో దాడి చేశారు. ఈ దాడిలో కౌశిక్ రెడ్డి ఇంటి కిటీకి అద్దాలు పగిలిపోయాయి. పూల కుండీలు ఇతర వస్తువులు ధ్వంసం చేశారు. అక్కడ ఉద్రిక్తత నెలకొనటంతో అరెకపూడి గాంధీని అరెస్టు చేసిన పోలీసులు.. అదే రోజు సాయంత్రం విడుదల చేశారు.
ఇక ఈ దాడిపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. గాంధీ రౌడీషీటర్లతో వచ్చి తనను హత్య చేయాలని చూశాడని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. పెద్ద ఎత్తున అనుచరులతో వచ్చి తన ఇంటిని ధ్వసం చేశాడని చెప్పారు. ఇది కుట్రపూరిత దాడి అని గాంధీ వల్ల తన ప్రాణాలకు ముప్పు ఉందని చెప్పారు. ఈ మేరకు కౌశిక్ రెడ్డి గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆయన ఫిర్యాదు మేరకు గాంధీ, ఆయన కుమారుడు, సోదురుడు, మరో ఇద్దరు కార్పొరేటర్లపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారు.